- పెడ్లర్లు, కస్టమర్లే టార్గెట్గా పోలీసుల ఆపరేషన్
- బెంగళూరు అడ్డాగా నైజీరియన్ గ్యాంగ్ దందా
- అఫెండర్స్ డేటా ఆధారంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్
‘‘ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ ఇచ్చిన సమాచారంతో పెడ్లర్స్ మీర్జా వహీద్బేగ్, సయ్యద్ రెహ్మాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. సప్లయర్స్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న కస్టమర్లు, వారికి డ్రగ్స్ సప్లయ్ చేసే వారి వివరాలను సేకరించారు. గోవా, బెంగళూరులో స్పెషల్ ఆపరేషన్లకు ప్లాన్ చేశారు. గతంలో పట్టుబడ్డ పాత డ్రగ్స్ పెడ్లర్ల డేటా ఆధారంగా నెట్వర్క్ను ట్రేస్ చేస్తున్నారు.’’
హైదరాబాద్,వెలుగు : సిటీలో డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా పాకుతోంది. సోషల్ మీడియా, ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ లే అడ్డాగా ఆర్డర్స్, డెలివరీ దందా జోరుగా నడుస్తోంది. ఇందులో కస్టమర్లే సప్లయర్స్గా మారి చైన్ సిస్టమ్లో భాగంగా గోవా, బెంగళూరు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ సిటీకి తెస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన యువతనే డ్రగ్స్ పెడ్లర్స్ టార్గెట్ చేసినట్లు పోలీసుల కేస్ స్టడీస్లో వెల్లడైంది. మద్యం, గంజాయికి బానిసలైన వారిని డ్రగ్స్కు కూడా అడిక్ట్ చేసి సప్లయర్స్గా మార్చుతున్నట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇలాంటి నెట్వర్క్ను బ్రేక్ చేసేందుకు యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, టాస్క్ఫోర్స్,లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్లాన్ చేశారు.
డ్రగ్స్ చైన్ ఛేదించేందుకు ఆపరేషన్స్
మూడు కమిషనరేట్లలో నమోదైన కేసుల డాటాతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్కు రెడీ అయ్యాయి. డ్రగ్స్ కేసుల్లో సప్లయర్లు, కస్టమర్ల డాటా ఆధారంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్(డోపమ్స్) ద్వారా దేశవ్యాప్తంగా డ్రగ్స్ పెడ్లర్ల డాటా ఇప్పటికే సేకరించారు. రాష్ట్రంలో పట్టుబడ్డ వారిని ట్రేస్ చేసి వారి కస్టమర్ల కాంటాక్ట్స్ను గుర్తిస్తున్నారు. డ్రగ్స్తో పాటు గంజాయి పెడ్లర్స్ లిస్ట్లను టీఎస్ కాప్స్ యాప్లోనూ అందుబాటులో ఉంచారు. ఇలా నిఘా పెడుతూ డ్రగ్స్ చైన్ను ఛేదించేందుకు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు.
నైజీరియన్స్లో హడల్
డ్రగ్స్ సప్లయర్స్కు కేరాఫ్ అడ్రస్ అయిన నైజీరియన్ నెట్వర్క్ను ఇప్పటికే దాదాపు చేధించారు. గతేడాది 12 మందిని అరెస్ట్.. ఇందులో నలుగురిని సొంత దేశాలకు డిపోర్ట్ చేశారు. దీంతో హైదరాబాద్లో డ్రగ్స్ సప్లయ్ అంటేనే నైజీరియన్ పెడ్లర్లలో భయం పట్టుకుంది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే గోవా, బెంగళూరు వెళ్లి షెల్టర్ లో ఉంటున్నారు. నైజీరియన్స్ సహా గోవాకు చెందిన పెడ్లర్లు తమ పాత కస్టమర్లను డ్రగ్స్ క్యారియర్స్గా, కమీషన్ ఏజెంట్స్గా మార్చుకుంటున్నారు. గోవా, ముంబై, బెంగళూరు నుంచి కొరియర్, స్పెషల్ డ్రగ్ క్యారియర్లతో డ్రగ్స్ రవాణా చేయిస్తున్నారు. ఇలాంటి ముఠాలపై పోలీసులు ఫోకస్ పెట్టినా చైన్ సిస్టమ్ తో సాగే దందాకు అడ్డుకట్టపడడంలేదు. మరోవైపు డ్రగ్ వాడకం పెరుగుతుండడతో హైదరాబాద్లో కొకైన్, ఎల్ఎస్ డీ, చరస్, హెరాయిన్ కు డిమాండ్ పెరిగింది.
కస్టమర్లనే సప్లయర్స్గా చేసుకుని..
మెట్రో సిటీల్లో నెట్వర్క్ ద్వారా రిసీవర్లు, సప్లయర్లకు కమీషన్ తో డ్రగ్స్ గ్యాంగ్స్ ఎర వేస్తున్నాయి. ఒక్కో గ్రాముకు మత్తును బట్టి రేట్ ఫిక్స్ చేసి డిమాండ్ ను బట్టి కమీషన్ అందిస్తున్నాయి. పబ్ లు, స్టార్ హోటల్స్లో పార్టీలకు ఆర్డర్స్పై సప్లయ్ చేయిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ల్లో కోడ్ భాషతో ఆర్డర్లు తీసుకుంటున్నారు. మరోవైపు సంపన్న కుటుంబాలకు చెందిన యువతతో పాటు ఇంజినీరింగ్ విద్యార్థులను డ్రగ్ సప్లయర్స్గా మార్చుతున్నాయి. దీంతో సిటీలో కొకైన్, చరస్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ విచ్చల విడిగా సప్లయ్ చేస్తున్నారు. ఇలాంటి ముఠాలపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో డ్రగ్స్ మూలాలను సమూలంగా ఛేదించేందుకు రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్కు ప్లాన్ చేశారు.