ఎవరి సంబురం వాళ్లదే.. విడివిడిగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఎవరి సంబురం వాళ్లదే.. విడివిడిగా రాష్ట్ర అవతరణ వేడుకలు
  • 21 రోజులునిర్వహించనున్నరాష్ట్ర సర్కార్​
  • సెక్రటేరియెట్​లోప్రారంభించనున్న కేసీఆర్​
  • గవర్నర్​కు, ప్రతిపక్షాలకు అందని ఆహ్వానం
  • కేంద్రం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఉత్సవాలు
  • కాంగ్రెస్ ​కార్యక్రమాలకు లోక్​సభ మాజీ స్పీకర్ మీరా కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు రాజకీయ పార్టీలు జోరుగా ఏర్పాట్లు చేశాయి. ఇటు రాష్ట్ర సర్కారు, అటు కేంద్ర సర్కారు.. మరో దిక్కు కాంగ్రెస్​ పార్టీ.. విడివిడిగా సంబురాలకు సిద్ధమయ్యాయి. తెలంగాణ సాధించింది తామేనంటూ బీఆర్ఎస్.. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనంటూ కాంగ్రెస్.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరించామంటూ బీజేపీ ఉత్సవాలు నిర్వహించనున్నాయి. దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం అధికారికంగా సెక్రటేరియెట్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈసారి 21 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు  నిర్వహించనుంది. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లు ఖర్చుచేయనుంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించగా.. ఈసారి గోల్కొండ కోటలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ఉత్సవాల్లో లోక్​సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌‌ పాల్గొననున్నారు. టీజేఎస్, బీఎస్పీ, వైఎస్సార్​టీపీ, టీడీపీ కూడా తమ పార్టీ ఆఫీసుల్లో ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నాయి.

బీఆర్ఎస్.. దావత్‌లు, వన భోజనాలు

తొమ్మిదేండ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందంటూ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఒక్కో రోజు.. ఒక్కో థీమ్‌తో వేడుకలను నిర్వహించనుంది. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నది. ఇప్పటికే అన్ని డిపార్ట్​మెంట్ల వారీగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, వీడియోలను ప్రత్యేకంగా తయారు చేయించింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో దావత్‌లను కూడా ఏర్పాటు చేసింది. వన భోజనాల మాదిరి చెరువు గట్ల మీద యాటలు కోసి భోజనాలు పెట్టిస్తున్నది. 

ఇదంతా గ్రామాల్లో ఉన్న సర్పంచ్‌లు, అధికార బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఆధ్వర్యంలోనే కొనసాగాలని స్పష్టం చేసింది. డిపార్ట్‌మెంట్ల వారీగా ఒక్కో రోజును ఘనంగా చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. అయితే వీటిల్లో కూడా అధికార బీఆర్ఎస్ లీడర్లకే ప్రాధాన్యం కల్పించాలని మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. దీంతో అంతా కలిసి చేసుకునే రాష్ట్ర పండుగను పార్టీ కార్యక్రమంగా మలుచుకుందనే విమర్శలు వస్తున్నాయి. కాగా, కొత్త సెక్రటేరియెట్‌లో వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా.. ఇక్కడ కూడా ప్రతిపక్ష లీడర్లను ఆహ్వానించలేదు. గవర్నర్ తమిళిసైకి సైతం ఇన్విటేషన్​ పంపలేదు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి కిషన్​ రెడ్డికి, మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్విటేషన్ పంపలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎంపీ కేశవరావు ఆవిష్కరించనున్నారు.

కేంద్రం.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా..

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. శుక్రవారం ఉదయం గోల్కొండ కోటలో జరిగే సెలబ్రేషన్లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఎగరవేయనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్లందరినీ ఆహ్వానించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేండ్ల పాలనకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శంకర్ మహదేవన్​ ఆధ్వర్యంలో దేశభక్తి పాటల ప్రోగ్రామ్​ను అరేంజ్ చేశారు. అన్ని రాష్ట్రాల రాజ్‌భవన్లలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అధికారికంగా నిర్వహించనున్నారు. దీంతో శుక్రవారం అన్ని రాష్ట్రాల్లో జాతీయ జెండా ఎగరవేసి వేడుకలు జరుపనున్నారు. గతంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయం, అన్ని జిల్లాల ఆఫీసుల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి.

కాంగ్రెస్.. పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారనే నినాదం జనాల్లోకి వెళ్లేలా రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు చేపట్టేందుకు కాంగ్రెస్  సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నాటి స్పీకర్ మీరా కుమార్ ఈ వేడుకలకు హాజరవుతున్నారు. నేతలు  శుక్రవారం ఉదయం గాంధీ భవన్‌లో జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేస్తారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే కూడా పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ముఖ్యులకు సన్మానం చేయనున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లోనూ కాంగ్రెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

రాజ్‌భవన్‌లో సామాన్యులతో..

రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శుక్రవారం జాతీయ జెండాను రాజ్​భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆవిష్కరిస్తారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అక్కడి దర్బార్ హాలులో ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. తర్వాత పుదుచ్చేరి వెళ్లి అక్కడా తెలంగాణ అవతరణ వేడుకలను గవర్నర్​ నిర్వహిస్తారు.టీజేఎస్​, బీఎస్పీ, టీడీపీ, వైఎస్సార్‌‌టీపీ ఆధ్వర్యంలో అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ అన్ని పార్టీలు వేడుకలను నిర్వహించనున్నాయి. ఎన్టీఆర్ భవన్​లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేస్తారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమ తమ పార్టీ ఆఫీసుల్లో  వేడుకలు జరపనున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంపై ఏర్పాటైన రాష్ట్రంలో అందర్నీ బీఆర్​ఎస్​ సర్కార్​ మోసం చేసిందనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లనున్నారు.