
- మారిన నాయకుల ధోరణి
- చిక్కుల్లో పడకుండా జాగ్రత్తలు
- ఏడాదిగా మారిన నేతల స్టైల్
హైదరాబాద్: మీడియాకు చిక్కకుండా మనసులో మాట చెప్పేస్తున్నారు లీడర్లు. చిట్ చాట్, ఆఫ్ ది రికార్డు పేరుతో కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ఇటీవలి కాలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల్లో చిట్ చాట్ ధోరణి బాగా పెరిగిపోయింది. చిట్ చాట్ అని బహిరంగంగానే చెప్తూ పిలుస్తున్నారు. ఈ సమయంలో కెమెరాలు, సెల్ ఫోన్లను కూడా అనుమతించడం లేదు. తీరా లోనికి వెళ్లిన తర్వాత అసలు విషయాలన్నీ చెప్పేస్తున్నారు. కొందరైతే ఏకంగా బండబూతులు మాట్లాడేస్తున్నారు. వాడు, వీడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యర్థిపై విమర్శలు, ఆధారాలు లేని ఆరోపణలు, కీలక అంశాలకు చిట్ చాట్ లను వేదికలుగా మార్చుకుంటున్నారు. అయితే న్యాయపరంగా చిక్కుల్లో పడకుండా ఉండేందుకే లైట్స్ ఆన్.. కెమెరాస్ ఆఫ్ చేయిస్తున్నారనే వాదన బలంగానే వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. పార్టీ ఏదైనా.. లీడర్ ఎవరైనా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులకు మాత్రమే పరిమితమైన ఈ సంప్రదాయం ఇప్పుడు జిల్లాల దాకా పాకింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు కూడా చిట్ చాట్ లపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం.
సంచలనాలన్నీ చిట్ చాట్ నుంచే
ఇటీవలి కాలంలో సంచలన వార్తలన్నింటికీ చిట్ చాట్ లే కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత చేసిన చిట్ చాట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ముసలానికి దారి తీసింది. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. అంతే కాకుండా తన సోదరుడు కేటీఆర్ ను, బావ హరీశ్ రావును ఉద్దేశించి విమర్శలు చేశారు. ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం కాదంటూ ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి చిట్ చాట్ పెడుతూ ఉంటారు. ఆ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావిస్తారు. రాహుల్ తో తనకు గ్యాప్ లేదని పలు చిట్ చాట్ లలో చెప్పారు. ఈసారి బీఆర్ఎస్ మీదున్న వ్యతిరేకతతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారని మరో సారి చిట్ చాట్ లో చెప్పారు. సీబీఐ, ఈడీ కేసులను చూపి బీఆర్ ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకోవాలనే ప్లాన్ నడుస్తోందని కూడా చెప్పుకొచ్చారు. వచ్చేసారి మాత్రం అభివృద్ధితోనే గెలుస్తామన్నారు. గతంలో మంత్రి కోమటిరెడ్డి చేసిన చిట్ చాట్ లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయన్నారు. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని అన్నారు. యాదగిరి గుట్టకు వెళితే దేవుడు కనబడకుండా చేశారని విమర్శించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చిట్ చాట్ లలో తన మనసులో మాట చెప్పేస్తున్నారు.