రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం..మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం..మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు
  • తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గూడల్లో 137 ప్లాట్లు 
  • ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్ గూడ, మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చేసిన, మౌలిక వసతులతో ఉన్న ఈ ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ తెలిపారు.

 ఆయా ప్రాంతాలను బట్టి బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరల్లోనే చదరపు గజానికి రూ. 20 వేల నుంచి 30 వేల వరకు అప్​సెట్ ప్రైస్​తో వేలం వేయనున్నట్టు తెలిపారు. సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాట్లు చాలా అనుకూలంగా ఉంటాయని ఎండీ గౌతమ్ తెలిపారు. 

మంచి కనెక్టివిటీతో ఎటువంటి వివాదాలు లేని క్లియర్ టైటిల్, ప్రభుత్వ యంత్రాంగమే ఈ లేవుట్లను అభివృద్ధి చేయడం, కొన్న వెంటనే నిర్మాణాలను చేపట్టేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లకు గతంలో పెద్ద ఎత్తున స్పందన రావడంతో మరోసారి వేలం వేయనున్నట్టు చెప్పారు. 

ఆసక్తి ఉన్నవారు నిర్ణీత ధరావతు (ఈఎండీ) మీ-సేవా కేంద్రాల్లో ఆన్ లైన్ /యూపీఐ ద్వారా చెల్లించవచ్చని, అలాగే డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు. ఓఆర్ఆర్,-ఆదిబట్ల, ఐటి కారిడార్ కు సమీపంలోని తొర్రూర్ లే అవుట్ లోని ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ఓఆర్ఆర్ సమీపంలోని బహదూర్ పల్లి, శంషాబాద్ ఎయిర్ పోర్టు కు దగ్గర్లోని కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ప్లాట్లకు బహిరంగ వేలం ఉంటుందన్నారు.

 ఇతర వివరాలకు www.swagruha.telangana.gov.in వెబ్ సైట్ చూడవచ్చన్నారు. అవసరమైతే 8121022230 (తొర్రూర్), 8347472106 (బహదూర్ పల్లి),7993455802 (కుర్మల్ గుడ)కు కాల్​చేయవచ్చన్నారు. 

అందుబాటులో ప్లాట్లు

తొర్రూర్ లో 105 ప్లాట్లు ఉండగా, ఇవి 200-, 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. చదరపు గజానికి కనీస ధర (అప్ సెట్ ప్రైస్) రూ. 25 వేలు నిర్ణయించారు. బహదూర్ పల్లిలో 12 ప్లాట్లు ఉండగా,  200, -1000 చ.గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. 

ఈ లేవుట్ లోని కార్నర్​ప్లాట్ కు చదరపు గజానికి కనీస ధర రూ.30 వేలు, ఇతర ప్లాట్లకు రూ. 27 వేలు నిర్ధారించారు. కుర్మల్ గూడలో 20 ప్లాట్లు 200, -300 చ.గజాల విస్తీర్ణంలో ఉండగా చదరపు గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్ణయించారు.  

ధరావతుతో రూ.2 లక్షల నుంచి 3 లక్షలు

తొర్రూర్ ప్రాంతంలోని ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపే వారు రూ. 2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 6 తేదీలోగా, బహదూర్ పల్లిలోని ప్లాట్లకు రూ. 3 లక్షలు, కుర్మల్ గూడలోని ప్లాట్లకు రూ.2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 7 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.