- వాసాలమర్రిలో ఇల్లు కట్టిస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్
- బీఆర్ఎస్ హయాంలో నెరవేరని కల
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాసాలమర్రిలో ఆగవ్వ
- సహా 112 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
- ఇల్లు పూర్తికావడంతో ఆగవ్వను కలిసి ముచ్చటించిన హౌసింగ్ ఎండీ గౌతమ్
- కాంగ్రెస్ వచ్చాక నా కల నెరవేరింది: ఆగవ్వ
యాదాద్రి, వెలుగు: కేసీఆర్ దోస్త్ ఆగవ్వ గుర్తున్నదా? యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన ఈమెను అప్పట్లో కేసీఆర్ తన దోస్త్గా చెప్పుకున్నారు. ఎర్రవెల్లి నుంచి యాదాద్రికి రోడ్డు విస్తరణలో భాగంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాసాలమర్రి గ్రామాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం హోదాలో వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్.. ఇండ్లు కోల్పోయిన అందరికీ ప్రభుత్వ నిధులతో పక్కా భవనాలు, పంచాయతీ ఆఫీ సు, స్కూలు, పీహెచ్సీ, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 22 జూన్ 2021న గ్రామంలో సభ పెట్టి ఊరోళ్లందరికీ జోర్దార్ దావత్కూడా ఇచ్చాడు. అప్పుడు కేసీఆర్ ఆగవ్వ పక్కనే కూర్చొని భోజనం చేశారు. కానీ ఆ తర్వాత వాసాలమర్రిని, అక్కడ ఇండ్ల నిర్మాణాన్ని నాటి సర్కారు పట్టించుకోలేదు.
కాంగ్రెస్ సర్కారు రావడంతో మారిన సీన్..
కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన తర్వాత వాసాలమర్రిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆగవ్వ సహా గ్రామంలో ఇండ్లు కోల్పోయిన112 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. చకచకా నిధులు మంజూరుచేయడంతో ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో వాసాలమర్రికి కొత్త కళ వచ్చింది. కాగా, ఇంట్లో నివాసం ఉంటున్న ఆగవ్వను హౌసింగ్ ఎండీ గౌతమ్, యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం పలకరించారు. 'ఆగవ్వా.. ఎలా ఉన్నారు? కొత్త ఇల్లు బాగుందా?’ అని పలకరించారు. దీనికి ఆగవ్వ “చాలా సంతోషంగా ఉన్న సారూ.. సొంత ఇంట్ల ఉండాలన్నది నా కల. ఆ ప్రభుత్వంలో తీరలే. కాంగ్రెస్ సర్కారు వచ్చాక నా కల నెరవేరింది. ఇప్పుడు బాగుంది. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని ఆగవ్వ తెలిపారు.
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు: హౌసింగ్ ఎండీ గౌతమ్
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావుతో కలిసి సింగన్న గూడెంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భువనగిరి మండలం అనంతారం, తుర్కపల్లి మండలం వాసాలమర్రి, కొండపురంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాసాలమర్రిలో పూరి గుడిసెలో ఉంటున్న వారితో మాట్లాడారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మంజూరైన ఇండ్లు, పురోగతిలో ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రౌండింగ్ కాని ఇండ్ల గురించి ఆరా తీశారు.రెండో విడతలో పూరి గుడిసె, రేకుల షెడ్స్లో నివసించే వారిని గుర్తించి వారికి ప్రయారిటీ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ అలివేలు, ఎంపీడీవోలు, ఏఈలు ఉన్నారు.
