విజయ్ 'జన నాయగన్' కు కావేరి సెగ.. కర్ణాటకలో ఆందోళనలు.. థియేటర్లలో షోలు రద్దు!

విజయ్ 'జన నాయగన్' కు కావేరి సెగ.. కర్ణాటకలో ఆందోళనలు.. థియేటర్లలో షోలు రద్దు!


కర్ణాటక - తమిళనాడు మధ్యకావేరి జల వివాదం  మళ్లీ రాజుకుంది. దీంతో  తమిళ స్టార్ హీరో , సీఎం విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమాకు కన్నడనాటలో ఊహించని షాక్ తగిలింది. మండ్యలో ఈ సినిమా ప్రదర్శనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో గురుశ్రీ థియేటర్‌లో  షోలను యాజమాన్యం రద్దు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 'జననాయగన్' మూవీ ప్రదర్శనలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కావేరి జల వివాదం.. 

ఇటీవల కావేరి వాటర్ రెగ్యులేషన్ అథారిటీ (CWRA) తమిళనాడుకు వరుసగా 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు, తాగునీటి కొరత ఉన్న నేపథ్యంలో కర్ణాటక రైతులు, కన్నడ సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కావేరి పరివాహక ప్రాంతమైన మండ్యలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.

 'జన నాయకన్' షోలు నిలిపివేత.. 
 

ఈ క్రమంలో గురుశ్రీ థియేటర్ ఎదుట కన్నడ సంఘాలు ఆందోళనకు దిగాయి. 'జన నాయకన్' పోస్టర్లను చించివేసి, సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు థియేటర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా..  పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని థియేటర్ యాజమాన్యం షోలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సమయంలో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన సినిమాను ప్రదర్శించడం సమంజసం కాదు కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి.

►ALSO READ | Spider Man Box Office: ‘స్పైడర్-మ్యాన్’ బాక్సాఫీస్ విధ్వంసం.. ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

అయితే కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో 'జన నాయకన్' ప్రదర్శనలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మరోవైపు మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.  ఇండియా గ్రాస్ రూ.179.25 కోట్లకు చేరుకోగా, విదేశాల్లో రూ.81 కోట్లకు పైగా వసూలు చేసింది. మరి ఈ కావేరి జల వివాదం 'జననాయగన్' వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.