టాలీవుడ్‌లో పనిచేయాలంటే మా కల్చర్‌ను గౌరవించాల్సిందే.. దీపికా వివాదంపై వెంకీ అట్లూరి స్ట్రాంగ్ కామెంట్స్!

టాలీవుడ్‌లో పనిచేయాలంటే మా కల్చర్‌ను గౌరవించాల్సిందే.. దీపికా వివాదంపై వెంకీ అట్లూరి స్ట్రాంగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె షూటింగ్ వర్కింగ్ అవర్స్ కారణంగా రెబల్ స్టార్ ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి 2' నుంచి తప్పుకున్న సంగతి తెలిసింది. ఈ ముద్దుగుమ్మ షరతులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  తెలుగు సినీ పరిశ్రమలో పనిచేయాలంటే ఇక్కడి పని విధానం, సంస్కృతిని గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ప్రతి సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేకమైన వర్కింగ్ కల్చర్ ఉంటుందని, ఒక భాష నుంచి మరో భాషకు వెళ్లే నటీనటులు ముందుగా అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. నేను హిందీలో సినిమా చేసే అవకాశం వస్తే ముందుగా మూడు నెలలు అక్కడి సెట్స్, వర్కింగ్ స్టైల్‌ను అధ్యయనం చేస్తాను. అలాగే బాలీవుడ్ నటులు తెలుగులో పనిచేయాలంటే తెలుగు ఇండస్ట్రీ పని విధానానికి తగ్గట్టే ఉండాలి అని చెప్పారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణంగా 11 నుంచి 12 గంటల పాటు షూటింగ్ జరుగుతుందని, కథ, లొకేషన్, ప్రొడక్షన్ అవసరాల ప్రకారం కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సమయం కూడా పని చేయాల్సి వస్తుందని వివరించారు. అలాంటి సందర్భాల్లో అందరూ సహకరించడం వల్లే సినిమా సజావుగా పూర్తవుతుందని వెంకీ పేర్కొన్నారు. అందువల్ల బాలీవుడ్ నటులు ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఊటీలో తీవ్ర చలిలో చిత్రీకరణ జరుగుతుండగా చివరి రోజు మిగిలిన సన్నివేశాలను పూర్తి చేయకపోతే అదే వాతావరణాన్ని మళ్లీ సృష్టించడం అసాధ్యమయ్యేదని చెప్పారు. ఆ సమయంలో హీరోయిన్ రవీనా టాండన్ పరిస్థితిని అర్థం చేసుకుని అదనపు సమయం పనిచేసి షూటింగ్ పూర్తి చేయడానికి సహకరించారని వెల్లడించారు.

ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, రవీనా టాండన్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'లక్కీ భాస్కర్' సీక్వెల్ కూడా తప్పకుండా ఉంటుందని, అయితే అది ప్రారంభం కావడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుందని వెంకీ అట్లూరి స్పష్టం చేశారు.