రుణమాఫీలో తెలంగాణ రికార్డు!

రుణమాఫీలో తెలంగాణ రికార్డు!
  •   ఏకకాలంలో రూ.31 వేల కోట్లు మాఫీ
  •   దేశవ్యాప్తంగా 2017 నుంచి రూ.2.80 లక్షల కోట్ల పంట రుణాలు మాఫీ 
  •   అత్యధికంగా మహారాష్ట్రలో రూ.79 వేల కోట్లు 
  •   రూ.59 వేల కోట్లతో సెకండ్ ప్లేస్​లో తెలంగాణ 
  •   ఎకోరాప్ సంస్థ రిపోర్టులో వెల్లడి  

హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా 2017 నుంచి వివిధ రాష్ట్రాలు రూ.2.80 లక్షల కోట్ల పంట రుణాలను మాఫీ చేశాయి. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పంజాబ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు 11 విడతల్లో రుణమాఫీ అమలు చేశాయి. ఈ మేరకు ఎకోరాప్ అనే సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్న నేపథ్యంలో ఎకోరాప్​ ఈ రిపోర్టును విడుదల చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే దాదాపు 39 లక్షల మంది రైతులకు చెందిన రూ.31వేల కోట్ల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నది.

ఇందులో భాగంగా గురువారం రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం రూ.6,098.93 కోట్లను రైతుల రుణ ఖాతాల్లో జమ చేసింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే ఏకకాలంలో రూ.31 వేల కోట్లు మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుంది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి మాఫీ చేయలేదు. 

మహారాష్ట్ర తర్వాత మనమే.. 

ఇప్పటి వరకు అత్యధిక మొత్తంలో రుణాలను మాఫీ చేసిన ఘనత మహారాష్ట్రకు దక్కుతుంది. ఆ రాష్ట్రం 2017 నుంచి 2020 వరకు రూ.79 వేల కోట్లు రుణాలు మాఫీ చేసి మొదటి స్థానంలో ఉన్నది. ఆ తర్వాతి స్థానం తెలంగాణ దక్కించుకున్నది. గతంలో బీఆర్ఎస్ 2014లో నాలుగు దఫాల్లో రూ.16,162 కోట్లు మాఫీ చేసింది. మళ్లీ 2018 నుంచి 2023 వరకు పలు దఫాల్లో రూ.11,600 కోట్లు మాఫీ చేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ.31 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నది. ఇది పూర్తయితే తెలంగాణలో రూ.58,762 కోట్ల పంట రుణాలు మాఫీ అయినట్టు అవుతుంది.