- తెలంగాణ రైజింగ్లో ఐటీ, ఫార్మా, స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్తో పాటు ప్రభుత్వ శాఖలకు స్టాల్స్
- ఐటీ, ఫార్మా, స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్ తో పాటు ప్రభుత్వ శాఖలకు స్టాల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8, 9వ తేదీల్లో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025'ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ సదస్సులో రాష్ట్ర అభివృద్ధిని, భవిష్యత్ విజన్ను కళ్లకు కట్టేలా భారీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. హాల్- 2లో ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్ లేఅవుట్ను ఖరారు చేశారు. ఇందులో మొత్తం 40 స్టాల్స్తో పాటు భారీ పెవిలియన్లను ఏర్పాటు చేయనున్నారు. స్టాల్స్ నిర్మాణం, నిర్వహణపై మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రవేశద్వారం వద్దే అత్యంత భారీగా 14x21 మీటర్ల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీ, దానికి సమానంగా ఎంఆర్డీసీ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఎగ్జిబిషన్ మధ్యలో ఆకర్షణీయమైన డోమ్, దానికి అనుసంధానంగా పర్యావరణ హిత కాన్సెప్ట్తో స్టాల్స్ కేటాయించారు. ఇక రక్షణ, అంతరిక్ష రంగానికి మొదటి నాలుగు స్టాల్స్ కేటాయించగా, స్పోర్ట్స్ యూనివర్సిటీకి రెండు స్టాల్స్ కేటాయించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దపీట వేస్తూ హెచ్ఎండీఏ , మెట్రో రైల్ విభాగాలకు స్టాల్స్ కేటాయించారు. వీటితో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలైన క్రెడాయ్, ఇమార్, జీఎంఆర్, నరెడ్కోలకు వరుసగా స్టాల్స్ అలాట్ చేశారు. విద్యా రంగానికి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ, ఉన్నత విద్య, ఏఐ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్ లకు ప్రత్యేక స్టాల్స్ ఉన్నాయి. సంక్షేమ రంగానికి సంబంధించి టామ్కామ్, ట్రైఫెడ్, వెల్ఫేర్ శాఖలకు స్టాల్స్ కేటాయించగా.. పర్యాటకం, సంస్కృతి, చేనేత, వైద్యారోగ్యం, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయం,- హార్టికల్చర్, -పౌర సరఫరాలు, కార్మిక శాఖ ఇలా అన్ని ప్రభుత్వ విభాగాలు తమ ప్రగతిని ప్రదర్శించేలా ప్లాన్ చేశారు.
