గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు 1.09 లక్షల కోట్లు

గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు 1.09 లక్షల కోట్లు
  • గ్లోబల్​ సమిట్​ వేదికగా 14 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు
  •     లక్ష మందికిపైగా ఉద్యోగావకాశాలు.. విద్యుత్​ శాఖపై గంటపాటు సెషన్​ 
  •     పీఎస్​పీ ప్రాజెక్టుల్లో రూ.45,650 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన మరిన్ని సంస్థలు

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో గ్రీన్​ ఎనర్జీ రంగంలో రూ. 1.09 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 14 సంస్థలు ముందుకొచ్చాయి. సోమవారం ఫ్యూచర్​ సిటీలోని -గ్లోబల్​సమిట్​వేదికగా ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది. తద్వారా కొత్తగా లక్ష మందికిపైగా ఉద్యోగాలు వస్తాయని విద్యుత్​ శాఖ ప్రకటించింది. 

అంతకుముందు సమిట్​లో విద్యుత్​ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​ ​ఆధ్వర్యంలో ‘పవరింగ్​ తెలంగాణ –2047: ఎనర్జీ ట్రాన్సిషన్​ క్లైమేట్​ ఫైనాన్స్​ అండ్​ జస్ట్​ ట్రాన్సిషన్​ ఫర్​ నెట్​ జీరో’ అనే అంశంపై గంటకు పైగా సెషన్​ జరిగింది. 

ఇవీ ఎంవోయూలు

2,750 మెగావాట్ల రెన్యువల్​ ఎనర్జీ ప్రాజెక్ట్​ ఏర్పాటు కోసం రూ.31,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ‘ఆక్సిస్​ ఎనర్జీ వెంచర్స్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​’ ముందుకొచ్చింది. ఈ–మిథనాల్​ ప్లాంట్ కోసం ‘ఏఎం గ్రీన్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్’  సంస్థ రూ. 8వేల కోట్లు.. 2జీ ఇథనాల్​ ప్లాంట్​ కోసం ‘ఏఎం గ్రీన్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్’  సంస్థ రూ.10 వేల కోట్లు.. 1,500 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్​ రెన్యువబుల్​ ఎనర్జీ ప్రాజెక్ట్స్​ కోసం ‘ఈ కొరియన్’​ సంస్థ రూ.16 వేల కోట్లు.. 2 వేల మెగావాట్ల ఇంటిగ్రేటేడ్​ రెన్యువబుల్​ ఎనర్జీ పోర్ట్​ పోలియో కోసం ‘ఏఎంఆర్​ ఇండియా లిమిటెడ్’​ సంస్థ రూ.12,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. 

పంప్డ్​ స్టోరేజ్​ పవర్​ ప్లాంట్​ కోసం ‘మై హోమ్​ ప్రైవేట్​ లిమిటెడ్’​ సంస్థ  రూ.7 వేల కోట్లు, సోలార్​ పార్క్​ కోసం ‘ఆస్థా గ్రీన్​ ఎనర్జీ వెంచర్స్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్’​ సంస్థ రూ.5,600 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు చేసుకున్నాయి. 

అదేవిధంగా వివిధ గ్రీన్​ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎస్​ఎల్​ఆర్​ సురభి పవర్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ రూ.3 వేల కోట్లు, అథిరథ్​ హోల్డింగ్స్​ ఇండియా లిమిటెడ్​ రూ.4 వేల కోట్లు, శ్రీ సురాస్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ అండ్​ గ్రూప్​ కంపెనీస్​ రూ.3,500 కోట్లు, సొలానిక్స్​ పవర్​ ప్రైవేట్​ లిమిటెడ్​ రూ.2,400 కోట్లు, హై జెన్కో గ్రీన్​ ఎనర్జీస్​ ప్రైవేట్ లిమిటెడ్​ రూ.1,250 కోట్లు, సీల్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ రూ.1,600 కోట్లు, యునైటెడ్​ టెలికామ్స్​ లిమిటెడ్​ రూ.2,500 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయని విద్యుత్​ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. 

పీఎస్​పీ ప్రాజెక్ట్​ల్లో రూ.45,650 కోట్ల పెట్టుబడులు!

రాష్ట్రంలో 7,460 మెగావాట్ల పంప్డ్​ స్టోరేజీ ప్లాం ట్స్​(పీఎస్​పీ) ఏర్పాటుకు రూ.45,650 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్రైవేట్​ సంస్థలు ముందుకొ చ్చాయి. గ్రీన్​కో ఎనర్జీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ (జీఈపీఎల్​) రూ.24 వేల కోట్లతో ములుగు జిల్లా ఇప్పగూడెం గ్రామం దగ్గర 3,960 మెగావాట్లు, గ్రీన్​ కో టీజీ01 ఐఆర్​ఈపీ ప్రైవేట్​ లిమిటెడ్​ రూ.5,800 కోట్లతో ఆదిలాబాద్​ జిల్లా జారీ గ్రామంలో 950 మెగావాట్లు, శ్రీ సిద్దార్థ్​ ఇన్​ఫ్రా టెక్​ అండ్​ సర్వీసెస్​ ఇండియా లిమిటెడ్​ రూ.5,600 కోట్లతో ఆదిలాబాద్​, నిర్మల్​ జిల్లా పరిధిలోని రనపూర్​ గ్రామంలో 900 మెగావాట్లు, ఆస్థా గ్రీన్​ ఎనర్జీ వెంచర్స్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​  రూ.4,650 కోట్లతో నిజామాబాద్​ జిల్లా మైలారం గ్రామంలో 750 మెగావాట్లు, సెరల్యూన్​ ఎనర్జీ సొల్యూషన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ రూ.5,600 కోట్లతో ఆదిలాబాద్​ జిల్లా రామపురలో 900 మెగావాట్ల  పీఎస్​పీల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని విద్యుత్​ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. ఇవన్నీ  ప్రైవేట్​ సంస్థలని పేర్కొన్నారు. 

ఇది పీపుల్స్ డాక్యుమెంట్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2025లో భాగంగా రూపొందించిన విజన్​డాక్యుమెంట్​రాష్ట్ర ప్రజల డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

భవిష్యత్ ​అంతా గ్రీన్​ఎనర్జీదే: భట్టి

భవిష్యత్​ అంతా గ్రీన్​ఎనర్జీ పైనే ఆధారపడి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐదేండ్లలో హైదరాబాద్​లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్​ బస్సుల వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తూనే.. 2047 నాటికి 1.39  లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. 

సోమవారం గ్లోబల్​ సమిట్​లో విద్యుత్​ శాఖపై జరిగిన తొలి సెషన్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. వందశాతం పర్యావరణ హిత వాహనాల  వైపు మారుతున్నట్లు చెప్పారు.  అనంతరం..  సెషన్​లో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు సోలార్​, విండ్​, థర్మల్​ పవర్​, బ్యాటరీ ఎనర్జీ, పంప్డ్​ స్టోరేజీ విద్యుత్​ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

జిల్లాల వారీగా జరిగిన పరిశోధనల ప్రకారం టూరిజం, ఆహార శుద్ధి, టెక్స్​టైల్​, సోలార్ ఉత్పత్తుల తయారీ లాంటివి  పెద్దఎత్తున చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఈ సెషన్​లో ఎన్​టీపీఎస్​ గ్రీన్​ సీఈవో సరిత్​ మహేశ్వరి, ఇదామ్​ ఇన్​ఫ్రా స్ట్రక్చర్​ కంపెనీ కో ఫౌండర్​ అజిత్​ పండిట్​, మహాలక్ష్మీ గ్రూప్​ ఫౌండర్​ అండ్​ సీఈవో హరిష్​ యెర్లగడ్డ, సెంటర్​ ఎనర్జీ స్టడీస్​ ఫ్రొఫెసర్​ రాజ్​ కిరణ్​, కోల్​ ఇండియా మాజీ ఛైర్మన్​ పీఎం.ప్రసాద్​, సోలార్​ బుల్​ ఎనర్జీ లిమిటెడ్​ ఎండీ శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.