
- ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి,పీజీ సీట్లు తక్కువున్నయి
- స్టైపెండ్ ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోండి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల పెంచేందుకు అనుమతి ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్( ఎన్ ఎంసీ ) చైర్మన్ బీఎన్ గంగాధర్ ను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ కోరారు. మెడికల్ కాలేజీలు పెరగడంతో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని.. మెడికల్పీజీ సీట్లు మాత్రం తక్కువగా ఉన్నాయని అన్నారు. పీజీ సీట్లు పెరిగితే, ప్రజలకు మేలు జరుగుతుందని, మెరుగైన వైద్య సేవలు అందుతాయని, మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కు కూడా ఇబ్బంది ఉండదని చైర్మన్ కు మంత్రి వివరించారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్ ను బేగంపేట టూరిజం ప్లాజాలో మంత్రి దామోదర కలిసారు.
ఎంబీబీఎస్ కాలేజీల్లో స్టైపెండ్ విషయంలో స్టూడెంట్స్ను ఇబ్బంది పెడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చైర్మన్ ను కోరారు. స్టూడెంట్స్ అందజేసిన రిప్రజెంటేషన్ కాపీని చైర్మన్కు ఇచ్చారు. రాష్ట్రంలో ఒకేసారి భారీ సంఖ్యలో కాలేజీలు పెరిగినందున, ఫ్యాకల్టీ సర్దుబాటు, బిల్డింగుల విషయంలో కొన్ని మినహాయింపులు కోరారు. మంత్రి విజ్ఞప్తులకు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు సంబంధించిన వివిధ అంశాలపై చైర్మన్, మంత్రి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్ఎంసీ చైర్మన్కు మంత్రి సూచించారు.
అంతకుముందు, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ఆహ్వానం మేరకు ఉస్మానియాలో స్టూడెంట్స్, టీచింగ్ ఫాకల్టీతో సమావేశమైన ఎన్ఎంసీ చైర్మన్ సమావేశమయ్యాక మాట్లాడారు. విద్యార్థి దశలో ఎంత ఎక్కువ మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించగలిగితే, అంత ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చునని సూచించారు. మెడికోలకు, ఫాకల్టీకి అన్ని విధాల అండగా ఉంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచేందుకు సహకరించాలని ఫ్యాకల్టీకి చైర్మన్ విజ్ఞప్తి చేశారు.
జూడాల సమస్యలు పరిష్కరించండి
పీజీ విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న అధిక ఒత్తిడి, పెరిగిన డ్యూటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ జూడా) అసోసియేషన్ కోరింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, స్టూడెంట్లు, జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎంసీ చైర్మన్ ను కోరినట్లు టీ జూడా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ న్యూటన్, అజయ్ కుమార్ గౌడ్ తెలిపారు.