ఢిల్లీ రిపబ్లిక్డే వేడుకల్లో కనువిందు చేయనున్న తెలంగాణ శకటం

ఢిల్లీ రిపబ్లిక్డే వేడుకల్లో కనువిందు చేయనున్న తెలంగాణ శకటం

ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించే రిపబ్లిక్ డే(జనవరి 26) వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించనున్నారు. మూడేండ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శనకు చోటు దక్కింది.  

మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్​తో శకటం రూపొందింది. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటం.. దేశ ప్రజాస్వామ పరిరక్షణలో భాగమనే చరిత్రను శకటం ద్వారా ప్రదర్శించబోతున్నది. ఎవరు సాయుధ పోరాటం చేసినా... అంతిమంగా అది హక్కుల కోసమే అనే భావనతో తెలంగాణ శకటం సిద్ధమైంది. 

ఉద్యమ నేపథ్యం నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రం ఎలా అడుగులు వేస్తున్నదో కూడా చూపించేందుకు ఈ శకటం రెడీ అయింది. ఆనాటి నిరంకుశ పాలన, తెలంగాణ ఆడ బిడ్డలకు జరిగిన అవమానాల గాథల నుంచి స్వరాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ తీరును దేశ ప్రజల కండ్లకు కట్టేలా శకటాన్ని సిద్ధం చేశారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ గోండు వీరుడు కొమురం భీం, బ్రిటీష్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న రాంజీ గోండు, వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాలను శకటంపై ప్రదర్శించారు. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల త్యాగాలు స్మరించేలా తెలంగాణ ప్రభుత్వం శకటాన్ని రూపొందిస్తున్నది.