హైదరాబాద్, వెలుగు : జాతీయ విద్యా విధానంతోపాటు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి చావ రవి తెలిపారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
విద్యావ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) పిలుపు మేరకు ఈ నెల 11,12,13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పాదయాత్రలు, బైక్ యాత్రలు చేపడతామని యూటీఎఫ్ నేతలు వెల్లడించారు. ఆగస్టు 12న జిల్లాల్లో దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేజీబీవీ, యూఆర్ఎస్ ల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న చలో ఎస్పీడీ ఆఫీస్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. గురుకుల టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5న మహాధర్నా చేపడతామని తెలిపారు.