
- ఒక్కో విగ్రహానికి రూ.15.5 లక్షలు అంచనా
- ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ గంగాధర్కు డిజైన్ బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్లో ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్లలోనూ తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ విగ్రహాలకు ఒక్కోదానికి రూ.15.5 లక్షలు చొప్పున ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. విగ్రహాల డిజైన్ బాధ్యతలను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఇన్చార్జ్ వీసీ గంగాధర్ కు ప్రభుత్వం అప్పగించింది. అన్ని చోట్లా ఒకే విధంగా విగ్రహం వచ్చేలా డిజైన్ ఖరారు చేయాలని ఇప్పటికే ఆయనకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
వీటిని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన రోజు, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ బర్త్ డే అయిన డిసెంబర్ 9న ఆవిష్కరించాలని ఆర్అండ్బీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సెక్రటేరియెట్ లో గతేడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 20 ఎడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం పోరాట స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా.. పిడికిలి బిగిసిన చేతులతో, నుదుటిన ఎర్రటి కుంకుమ బొట్టు, చెవికి బంగారు కమ్మలు, ఆకుపచ్చ రంగు చీర, ఎడమ చేతిలో జొన్న, మొక్కజొన్న కంకులు, చేతికి ఎర్రటి ఆకుపచ్చ గాజులు, కాలికి మెట్టెలు గజ్జలు, ముక్కుకి ముక్కు పుడక, మెడలో మూడు రకాల ఆభరణాలతో ఏర్పాటు చేశారు.