
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక పాలనతోనే ఇది సాధ్యమైందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ‘‘2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.87 లక్షలకు చేరుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఒక గొప్ప మైలురాయి. సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీల నాయకత్వం, దార్శనిక పాలన కారణంగానే ఇది సాధ్యమైంది” అని పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. ‘‘ఈ విజయం కేవలం ఆర్థికపరమైనదే కాదు..సమతుల్య అభివృద్ధి, రైతుల సాధికారత, పరిశ్రమల బలోపేతం, పెట్టుబడుల ప్రోత్సాహం, సమ్మిళిత సంక్షేమ కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది” అని మహేశ్గౌడ్ తెలిపారు.