హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ్లోబల్ సమిట్లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ను జూపల్లి ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించేలా తెలంగాణ పర్యాటక అందాలు, చారిత్రక ప్రదేశాల ఫొటోలను డిజిటల్ స్క్రీన్లో పర్యాటక శాఖ ప్రదర్శించింది.
రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే పర్యాటక ప్రాంతాలున్నాయో తెలుసుకునేలా టచ్ కియోస్క్ను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి... బహుమతులను గెలుచుకోండి.. అని మంత్రి చెప్పారు. నూతన పర్యాటక విధానం 2025–-2030తో పునరుత్తేజం వచ్చిందన్నారు. నూతన పర్యాటక పాలసీపై ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారని, త్వరలో పర్యాటక రంగం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
