హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పరిపాలనా కారణాలతో మొత్తం 12 మంది ఐఎఫ్ఎస్, నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాలకు జిల్లా అటవీ అధికారులను (డీఎఫ్వో)లను కేటాయించారు.
తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ అదనపు డైరెక్టర్గా ఉన్న ఎస్. రమేశ్ను హైదరాబాద్లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్ కన్జర్వేటర్గా నియమించారు. ఫారెస్ట్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ బి. ప్రవీణను ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీన్గా బదిలీ చేశారు. రాజన్న సిరిసిల్ల డీఎఫ్వో సీహెచ్ బాలమణిని కుమ్రంభీం ఆసిఫాబాద్ డీఎఫ్వోగా నియమించారు.
కామారెడ్డి డీఎఫ్వో బి. నిఖితను వరంగల్ డీఎఫ్వోగా, వరంగల్ డీఎఫ్వోగా ఉన్న అనుజ్ అగర్వాల్ను ఖమ్మం డీఎఫ్వోగా బదిలీ చేశారు. నిజామాబాద్ డీఎఫ్వో వికాస్ మీనాను ములుగు డీఎఫ్వోగా, ఖమ్మం డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ను నిజామాబాద్ డీఎఫ్వోగా అపాయింట్ చేశారు. మంచిర్యాల డీఎఫ్వో శివ్ ఆశిష్ సిం+గ్ను మహబూబ్నగర్ జిల్లాకు, అక్కడ పనిచేస్తున్న ఎస్. సత్యనారాయణను రాజన్న సిరిసిల్ల డీఎఫ్వోగా ట్రాన్స్ఫర్ చేశారు.
ముందుగా బదిలీ అయిన రాహుల్ కిషన్ జాదవ్ను మంచిర్యాల డీఎఫ్వోగా, నీరజ్ కుమార్ తిబ్రేవాల్ను కామారెడ్డి డీఎఫ్వోగా నియమించారు. వికారాబాద్ డీఎఫ్వో జి. జ్ఞానేశ్వర్ను బదిలీ చేస్తూ, ఆయనను పీసీసీఎఫ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

