- తెలంగాణ– జపాన్ మధ్య నైపుణ్య వారధి
- అంతర్జాతీయ శిక్షణ, విద్యార్థుల మార్పిడికి అంగీకారం
- ఏటీసీలతో జపాన్ పారిశ్రామిక అవసరాలకు తగ్గ శిక్షణ.. ‘టామ్కామ్’ తరహా రోడ్మ్యాప్
- హిరోషిమా వైస్ గవర్నర్, సాంకేతిక నిపుణులతో మంత్రి వివేక్ బృందం భేటీ
- డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమిట్కు ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువతకు అంతర్జాతీయస్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జపాన్తో సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జపాన్ పర్యటనలో ఉన్న శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ టోరు యోషిమత్సుతో బుధవారం విస్తృతస్థాయి చర్చలు జరిపింది. తెలంగాణలో నిరుద్యోగ యువతను భవిష్యత్ సాంకేతిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్న విధానాన్ని మంత్రి వారికి వివరించారు.
సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, షిప్బిల్డింగ్, బయోటెక్నాలజీ, అత్యాధునిక తయారీ, ఇంధన రంగాల్లో జపాన్ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణ నుంచి సుశిక్షితులైన మానవ వనరులను అందించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రతిపాదించారు. కేవలం ప్రాథమిక అవగాహనకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక ప్రాజెక్టులు, సాంకేతిక ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడులు, యువత నియామకాలే లక్ష్యంగా ముందుకు సాగాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
హైదరాబాద్లో డిసెంబర్ 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2026’కు హాజరుకావాల్సిందిగా హిరోషిమా ఉన్నతాధికారులకు మంత్రి వివేక్వెంకటస్వామి ఆహ్వానం పలికారు. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
ఫుకుయామా టెక్నికల్ స్కూల్ సందర్శించిన మంత్రి బృందం
ఫుకుయామా హయ్యర్ టెక్నికల్ స్కూల్ను మంత్రి వివేక్ బృందం సందర్శించింది. జపాన్ అనుసరిస్తున్న సాంకేతిక విద్యా విధానాన్ని అధ్యయనం చేసింది. అక్కడ 60 శాతం ప్రాక్టికల్స్, 40 శాతం థియరీ ప్రాతిపదికన స్థానిక పరిశ్రమల డిమాండ్కు తగ్గట్టు కోర్సులు నిర్వహిస్తున్న తీరును పాఠశాల యాజమాన్యం మంత్రికి వివరించింది. పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల అత్యాధునిక ఇంజినీరింగ్పై రెండేండ్లపాటు శిక్షణనిచ్చే ఆటోమొబైల్ ల్యాబ్లతోపాటు కన్స్ట్రక్షన్, ఇంటీరియర్ డిజైనింగ్, ప్రెసిషన్ వెల్డింగ్, ఎలక్ట్రికల్ విభాగాల్లోని అధునాతన యంత్రాలను మంత్రి పరిశీలించారు.
పని ప్రదేశంలో అత్యున్నత రక్షణ ప్రమాణాలు, అంకితభావం, క్రమశిక్షణ, ఆధునిక పరికరాల నిర్వహణలో జపాన్ పాటిస్తున్న పద్ధతులను ఈ సందర్భంగా బృందం ప్రత్యేకంగా అభినందించింది. వొకేషనల్ ట్రైనింగ్ డివిజన్ డైరెక్టర్ తకమురా రేకో, ప్రిన్సిపాల్ ఫినోయిషి హిరోయోషితో జరిపిన చర్చల్లో విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలకు ప్రాథమిక అంగీకారం కుదిరింది. తెలంగాణలోని పాలిటెక్నిక్, సాంకేతిక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు జపాన్ పరిశ్రమల ఆధారిత కరిక్యులమ్ ఎంతో దోహదపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత కాలపరిమితితో విద్యార్థుల ఇంటర్నేషనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్కు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
జపాన్లో ఉద్యోగాల కోసం ప్రత్యేక రోడ్మ్యాప్..
జర్మనీ ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘టామ్కామ్’ ద్వారా అమలు చేస్తున్న విజయవంతమైన నమూనా తరహాలోనే జపాన్ కోసం వ్యవస్థీకృత రోడ్మ్యాప్ను అమలు చేస్తామని మంత్రి వివేక్ ప్రకటించారు. జపాన్లో నైపుణ్యం కలిగిన సాంకేతిక మానవ వనరులకు భారీ డిమాండ్ ఉన్నందున, మన అభ్యర్థులకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు జపనీస్ భాష, అక్కడి పని సంస్కృతి, జీవన విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ వర్క్ఫోర్స్ మొబిలిటీ కింద రాష్ట్ర యువతకు ముందస్తు సన్నద్ధత కల్పించి, గ్లోబల్ ప్రమాణాలతో జపాన్ పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు పొందేలా చూస్తామన్నారు.
ఇరు ప్రాంతాల మధ్య సహకారాన్ని మరింత వేగవంతం చేసేందుకు హిరోషిమా ప్రిఫెక్చర్ ప్రతినిధి బృందం వచ్చే అక్టోబర్లో హైదరాబాద్లో పర్యటించి నిర్దిష్ట రంగాలపై తుది ఒప్పందాలు చేసుకోనుందని వెల్లడించారు. తెలంగాణ యువత ప్రతిభకు జపాన్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, సరికొత్త ఉపాధి విప్లవానికి నాంది పలకడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉద్ఘాటించారు. సాంకేతిక శిక్షణను నాణ్యతా ప్రమాణాలతో అనుసంధానించి అంతర్జాతీయ పారిశ్రామిక వేదికలపై తెలంగాణను అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.
