పాక్ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 14 మంది శిశువులు సజీవదహనం

పాక్ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 14 మంది శిశువులు సజీవదహనం
  • ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క శిశువు
  • ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లోని పీఐఎంఎస్ దవాఖానాలో విషాదం
  • డెడ్ బాడీలను గుర్తించేందుకు పేరెంట్స్ డీఎన్ఏ సేకరణ
  • షార్ట్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌తో మంటలు.. ఆక్సిజన్ పైప్​లైన్ల వల్ల వేగంగా వ్యాప్తి

ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్) ఆసుపత్రి మూడో అంతస్తులో బుధవారం ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మాతా-శిశు సంరక్షణ వార్డులోని14 మంది పసికందులు సజీవదహనమయ్యారు. ఒకే ఒక్క శిశువును మాత్రం అక్కడి డాక్టర్ రక్షించగలిగారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది 6 ఫైరింజన్లు, 4 అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

అయితే, నవజాత శిశువుల మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి వివరాలు తెలుసుకోవడానికి తల్లిదండ్రుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. వార్డులో ఆక్సిజన్ లైన్లు ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయని వివరించారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఉన్నారని చెప్పారు.

పాక్ ప్రధాని షరీఫ్ దిగ్భ్రాంతి 

ఈ ఘటన పట్ల పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులతో అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఫెడరల్ హెల్త్ సెక్రటరీ ముహమ్మద్ అస్లాం గౌరీని ప్రధాని సస్పెండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు అదనపు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, అగ్నిప్రమాదంలో 14 మంది పసికందులు చనిపోయారనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.