న్యూయార్క్: యూఎస్ ఓపెన్లో ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకున్న స్టార్ జోడీ సెరెనా విలియమ్స్–కార్లోస్ అల్కరాజ్ జోడీ పోరాటం ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో సెరెనా (అమెరికా)–అల్కరాజ్ (స్పెయిన్) 4–5 (4/7), 1–4తో బెలిండా బెన్సిస్ (స్విట్జర్లాండ్)–ఫ్లావియో కొబలి (ఇటలీ) చేతిలో ఓడారు. 55 నిమిషాల మ్యాచ్లో తొలి సెట్లో గట్టి పోటీ ఇచ్చిన సెరెనా ద్వయం రెండో సెట్లో పూర్తిగా తేలిపోయింది.
నాలుగేళ్ల విరామం తర్వాత 44 ఏళ్ల వయసులో కోర్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సెరెనా సర్వీస్ల్లో ఆకట్టుకుంది. కుడి మణికట్టు గాయం కారణంగా నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్న అల్కరాజ్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. మరో క్వార్టర్స్ పోరులో ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్)–గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 5–4 (8/6), 4–5 (3/7), 10–8తో సినియాకోవా (చెక్)–పాటెన్ (అమెరికా)పై గెలిచి సెమీస్లోకి అడుగుపెట్టారు.
