- దేశంలోకి చొరబడి ఆధార్,
- పాన్ కార్డులు పొందుతున్నరు
- ఆపై పౌరసత్వం కోసం ప్రయత్నాలు
- ఏజెన్సీల మధ్య సమన్వయం లేదు,
- పత్రాల పరిశీలనలో లోపాలున్నయ్
- కేంద్రం చర్యలు తీసుకోవాలని
- బాంబే హైకోర్టు సూచన
ముంబై: విదేశీయులు సరిహద్దులు దాటి అక్రమంగా మన దేశంలోకి చొరబడుతున్నారని, భారత పౌరసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఆధార్, పాన్ కార్డ్ వంటి పత్రాలను మోసపూరితంగా పొందుతున్న ధోరణి పెరుగుతోందని బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏజెన్సీల మధ్య సమన్వయం, పత్రాల పరిశీలనలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఈ ధోరణి స్పష్టం చేస్తోందని జస్టిస్ ఏ.ఎస్.గడ్కరీ, జస్టిస్ కమల్ ఖాటాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అటువంటి వ్యక్తులను గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సరిహద్దులు దాటి వచ్చి నకిలీ పత్రాల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందినా లేదా తప్పుడు పత్రాలను సృష్టించుకున్న వ్యక్తులను దర్యాప్తు సంస్థలు వెంటనే గుర్తించడానికి, బహిష్కరించడానికి, తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి వీలుగా ఆధార్ చట్టంలో అవసరమైన సవరణలు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని కోర్టు ఆదేశించింది.
అఫ్గానిస్తాన్ పౌరుడు అయిన మాజిద్ ఖాన్ షా అనే వ్యక్తి గుర్తింపు సమాచారాన్ని, రికార్డులను వెల్లడించాలని యూఐడీఏఐను కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. ‘‘వీసా గడువు ముగిసిన తర్వాత కూడా మాజిద్ ఖాన్ షా భారతదేశంలో అక్రమంగా ఉన్నాడు. అసలు పాస్పోర్ట్ను ధ్వంసం చేసి, మిరాజ్ తాహిర్ ఖాన్గా తప్పుడు గుర్తింపును సృష్టించుకున్నాడు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, స్కూల్ టీసీ వంటి నకిలీ గుర్తింపు పత్రాలను పొంది.. వాటి ఆధారంగా భారతీయ పాస్పోర్ట్ను పొందాడు” అని కోర్టు ధ్రువీకరించింది. అతడిపై నాలుగు వారాల్లోగా ఇమ్మిగ్రేషన్ అధికారులు బహిష్కరణ చర్యలు ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
