హైదరాబాద్, వెలుగు: శ్రీలంక–తెలంగాణ మధ్య బౌద్ధ, సాంస్కృతిక, పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల రవీంద్రభారతిలో నిర్వహించిన ‘4వ నృత్యంగాణ’ కార్యక్రమంలో సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించిన శ్రీలంక కళాకారుల బృందం బుధవారం సెక్రటేరియెట్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా కళాకారుల బృందాన్ని, సింగిడి సాంస్కృతిక సంస్థ డైరెక్టర్ విశ్వకర్మ డీఆర్కేను మంత్రి శాలువాతో సత్కరించారు. తెలంగాణ వేదికపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన శ్రీలంక కళాకారులను మంత్రి అభినందించారు. బౌద్ధం, సంస్కృతి, కళలు, వారసత్వం వంటి అంశాలు శ్రీలంక–తెలంగాణ మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ప్రతీకలని పేర్కొన్నారు.
