- 29న అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ మీటింగ్
- కౌశిక్ శాసన సభ్యత్వం రద్దుపై ఊహాగానాలు
హైదరాబాద్, వెలుగు: గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ సమావేశం శనివారం జరగనుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి కమిటీ చైర్మన్, సభ్యులకు లేఖలు పంపారు. అసెంబ్లీలోని ఒకటో నంబర్ కమిటీ హాల్లో 29న ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ మీటింగ్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో హాట్ టాపిక్గా మారింది.
కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సభ్యత్వంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. తదుపరి చర్యల కోసం అసెంబ్లీ స్పీకర్కు ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయనుంది. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్.. కౌశిక్ రెడ్డిని కాపాడేందుకు అవసరమైన ఆధారాలను సేకరించే పనిలో పడింది. ఆ రోజు అసెంబ్లీ లో ఏం జరిగింది, దానికి సంబంధించిన ఆడియో, వీడియోలు, మీడియాలో వచ్చిన వార్తలు, న్యూస్ క్లిప్పింగులను సిద్ధం చేసుకుంటోంది. కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు కాకుండా బలమైన వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ మాత్రం కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయించాలనే పట్టుదలతో ఉంది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో ఆలోగానే అతని సభ్యత్వంపై వేటు వేయాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.
