- అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెట్లకు శిక్షణ, స్పోర్ట్స్ లో సాంకేతిక సహకారం
- 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారుల తయారీకి కార్యాచరణ
- అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన ‘కొరియా నేషనల్ స్పోర్ట్యూనివర్సిటీ’ మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ) కుదిరింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా కేఎన్ఎస్యూ అధ్యక్షుడు మూన్ వోన్-జేతో జరిపిన ద్వైపాక్షిక చర్చల కొనసాగింపుగా ఈ ఒప్పందం ఖరారైంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ (హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్), స్పోర్ట్స్ సైన్స్ పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఈ భాగస్వామ్యం వేదిక కానుంది.
తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి ప్రపంచ స్థాయి శాస్త్రీయ శిక్షణా విధానాలను అందించే ఉద్దేశంతో ఈ ప్రణాళికను రూపొందించారు. కేవలం అకడమిక్ అంశాలకే పరిమితం కాకుండా క్రీడా విద్యా విధానం, కోచింగ్ నైపుణ్యాలు, క్రీడాకారుల శారీరక సామర్థ్య పెంపుదలకు సంబంధించిన అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను రాష్ట్రంలో అమలు చేయడానికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేయనుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘కేఎన్ఎస్యూ’ ఒలింపిక్ స్థాయి క్రీడాకారుల తయారీలో అంతర్జాతీయంగా విశేష అనుభవం కలిగిన సంస్థ.
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్లో దక్షిణ కొరియా సాధించిన మొత్తం 32 పతకాల్లో, ఒక్క కేఎన్ఎస్యూలో శిక్షణ పొందిన అథ్లెట్లే 16 పతకాలు సాధించడం ఆ సంస్థ శిక్షణా ప్రామాణికతను స్పష్టం చేస్తోంది. ఆ స్థాయి క్రీడా సంస్కృతిని, శిక్షణా నైపుణ్యాలను రాష్ట్రానికి అనుసంధానించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశారు. ముఖ్యంగా భారత్ దృష్టి సారిస్తున్న 2036 ఒలింపిక్స్ నాటికి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే నైపుణ్యం కలిగిన అథ్లెట్లను సిద్ధం చేసేందుకు ఈ భాగస్వామ్యం పునాదిగా నిలవనుంది. ఈ భాగస్వామ్యాన్ని కార్యరూపంలోకి తేవడంలో సమన్వయం వహించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, వైఐఎస్యూ ప్రతినిధుల కృషిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎక్స్లో అభినందించారు.
