హైదరాబాద్, వెలుగు: సర్కారు విద్యాసంస్థల్లోని పేద విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి విద్యను, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఉచిత శిక్షణను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం 93 కేజీబీవీలను ‘ఎక్స్లెన్స్’ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిన సర్కార్.. వీటి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూ.18 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం 3 కేజీబీవీలను సూపర్ స్పెషల్ ట్రైనింగ్ విద్యాసంస్థలుగా మార్చాల ని విద్యాశాఖ నిర్ణయించింది.
వీటిని గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రారం భించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సూపర్ స్పెషల్ కేజీబీవీల్లో ఎంపిక చేసిన మెరిట్ విద్యార్థినులకు ఇంజినీరింగ్, మెడికల్, లా, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇంట ర్ ఫస్టియర్ నుంచే వీరికి జేఈఈ, నీట్, క్లాట్ లాంటి పరీక్షలకు కార్పొరేట్ స్థాయి కోచింగ్ అందించాలని నిర్ణయించారు.
