అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలి

అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలి

ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లు, భద్రత, ఇతర అంశాలపై ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని.. ఈసారి కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేయాలని  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సమావేశాలు జరిగే అన్ని రోజులు ప్రభుత్వ  ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 

ప్రతీ శాఖ తరపున నోడల్ అధికారి..

శాసనసభ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి అధికారులు ప్రభుత్వానికి సహకారం అందించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషల్లో అందించాలని సూచించారు. ప్రతి శాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని....నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలన్నారు. స్థానిక శాసనసభ్యునికి ముందస్తుగా సమాచారం అందించాలన్నారు.  ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకుండా రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలన్నారు. శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరపున అందించాలన్నారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ..ఎవరికైనా లక్షణాలు ఉంటే నిర్ధారణ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ డిస్పెన్సరీలో కరోనా టెస్టింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన సభ్యులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలన్నారు.

శాసనసభ పరిసరాలు ప్రశాంతంగా ఉండాలి..
తెలంగాణ  పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనదని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలన్నారు. గతంలో సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని చెప్పారు. ఈసారి కూడా అదేవిధంగా జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.