కాంగ్రెస్​ వైపు తెల్లం వెంకటరావు అడుగులు

కాంగ్రెస్​ వైపు తెల్లం వెంకటరావు అడుగులు
  • మొన్న సీఎంతో భేటీ.. నిన్న కేసీఆర్ మీటింగ్​కు డుమ్మా
  •  బీఆర్​ఎస్​తో అంటీముట్టనట్టు వ్యవహారం 
  • నష్టనివారణకు హరీశ్​రావు చర్యలు

భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్​ఎస్ కు ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్​ వైపు అడుగులు వేస్తున్నారు.  తన రాజకీయ గురువు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి ఆయన ఆదివారం సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు. అధికారికంగా పార్టీ మారకపోయినా ఆయన కాంగ్రెస్​తోనే  కలసి నడవనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తెల్లం వెంకటరావు కూడా కాంగ్రెస్​లో చేరారు. భద్రాచలంలో కాంగ్రెస్​ సిట్టింగ్  ఎమ్మెల్యే ఉండడంవల్ల టికెట్​ రాదని కన్ఫమ్​ కావడంతో చివరి నిమిషంలో తిరిగి బీఆర్​ఎస్​లోకి వచ్చి టికెట్​ దక్కించుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం, పొంగులేటి మంత్రి కావడంతో వెంకటరావు కూడా కాంగ్రెస్​లోకి వెళ్తారన్న ఊహాగానాలు వచ్చాయి. తాను పార్టీ మారబోవడంలేదని, బీఆర్​ఎస్​తోనే ఉంటానని వెంకటరావు చెప్పినా.. పార్టీతో అంటీముట్టనట్టే ఉంటున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం పర్యటనకు వస్తే ఆయన ప్రత్యేకంగా వెళ్లి కలిశారు.  ఆ తర్వాతి రోజు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ,  అన్నారం టూర్​కు వెళ్లగా వెంకటరావు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని  కలవడం.. సోమవారం తెలంగాణ భవన్​లో జరిగిన మహబూబాబాద్​ లోకసభ నియోజకవర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం ద్వారా  ఆయన తన అంతరంగాన్ని స్పష్టం చేసినట్టయ్యిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 

 కేడర్​ చేజారకుండా.. 

వెంకటరావు అడుగులను గమనిస్తున్న బీఆర్ఎస్​ హైకమాండ్​ నియోజకవర్గంలో కేడర్​ చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. మాజీ మంత్రి హరీశ్​రావు భద్రాచలంపై ఫోకస్​ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ఇన్​చార్జిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ తాతా మధు నియోజకవర్గంలో  తాజా పరిస్థితులపై పార్టీ పెద్దలకు రిపోర్ట్​ చేశారు. తెల్లం వెంకటరావు కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపుతున్నారని, ఆయన పార్టీతో కొనసాగే అవకాశంలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో సోమవారం భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్​చార్జి  మానె రామకృష్ణను బీఆర్ఎస్​మాజీ మంత్రి హరీశ్​రావు హైదరాబాదుకు  పిలిపించుకుని మాట్లాడారు. వెంకటరావు పార్టీ మారినా కేడర్ ను  కాపాడుకోవాలని సూచించారు.   లోకసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, హైకమాండ్​ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు.