కృష్ణాజిల్లా : తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దొంతు చిన్నా, గురుమూర్తి సహా 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట టీడీపీ నేతలను హాజరుపర్చారు. అయితే.. కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో పట్టాభి తన చేతులను మీడియా ప్రతినిధులకు చూపించాడు. తనను చిత్రహింసలు పెట్టారంటూ తన చేతికి ఉన్న గాయాలను చూపిస్తూ కోర్టులో లోపలికి వెళ్లారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో ఈనెల 20న జరిగిన ఘటన నేపథ్యంలో పట్టాభితో పాటు మరికొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గన్నవరం పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలకు వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తన భర్త పట్టాభిరామ్ను దారుణంగా హింసించారని ఆయన భార్య చందన ఆరోపించారు. ఉన్నతాధికారుల సహకారంతోనే ఇదంతా జరిగిందని చెప్పారు. తోట్లవల్లూరు పీఎస్లో తన భర్తను ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి ఇంత ఆందోళనగా ఎప్పుడూ కనిపించలేదన్నారు.
మరోవైపు.. తెలుగుదేశం నేతలను కోర్టుకు తరలించే క్రమంలో గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసుల ఆంక్షలను చేధించుకుని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పీఎస్కు చేరుకుని.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కూడా గన్నవరం కోర్టు వద్దకు వచ్చారు.