
- ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్కు ఆరెంజ్ అలర్ట్
- ఈ 3 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు ఉండొచ్చు
- ఆసిఫాబాద్లో కనిష్టంగా 11 డిగ్రీల నైట్ టెంపరేచర్ నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చలికి జనం వణుకుతున్నరు. ఇటు పగటి టెంపరేచర్లు, అటు రాత్రి టెంపరేచర్లు పడిపోతున్నాయి. పొద్దంతా చలిగాలులు వీస్తుండగా.. రాత్రి టెంపరేచర్లలో మాత్రం విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలున్నట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) రిపోర్టులు చెప్తున్నాయి. బుధవారం నుంచి రాత్రి టెంపరేచర్లు మరింత పడిపోయే ప్రమాదముందని వెల్లడిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో10 డిగ్రీలలోపుకు నైట్ టెంపరేచర్లు పడిపోయే ప్రమాదముందని టీఎస్డీపీఎస్ హెచ్చరించింది. ఆయా జిల్లాలను ‘ఆరెంజ్’ అలర్ట్లో పెట్టింది. జయశంకర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో 10 డిగ్రీలు, మిగతా రాష్ట్రమంతటా 15 డిగ్రీలలోపే నైట్ టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
4 జిల్లాల్లో 30 డిగ్రీలలోపే..
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే నమోదయ్యాయి. మెదక్ జిల్లా చిలప్చెడ్లో అత్యల్పంగా 29.1 డిగ్రీల పగటి టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డిలో 29.5, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 29.6 డిగ్రీల చొప్పున మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఆయా జిల్లాల్లో మధ్యాహ్నంపూట కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. జోగులాంబ గద్వాల (30.1), మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్ (30.3), ఆదిలాబాద్ (30.4), యాదాద్రి భువనగిరి (30.6), మహబూబ్నగర్ (30.8), నల్గొండ, సూర్యాపేట (30.9) జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లిలోని కాటారంలో అత్యధికంగా 32.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లో 31 నుంచి 32 డిగ్రీల మధ్యే మధ్యాహ్నం టెంపరేచర్లు రికార్డు అవుతున్నట్టు టీఎస్డీపీఎస్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణలో రాత్రి గజగజ
ఉత్తర తెలంగాణలో రాత్రిపూట చలి పెరుగుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి టెంపరేచర్లు కూడా విపరీతంగా పడిపోతున్నాయి. 15 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. ఏజెన్సీ ఏరియా కావడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టు నిపుణులు చెప్తున్నారు. అత్యల్పంగా ఆసిఫాబాద్లో రాత్రి 11 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్లో 12.3, నిర్మల్లో 13.1, సిద్దిపేటలో 13.5, జగిత్యాలలో 13.6, మంచిర్యాలలో 13.9, జయశంకర్ భూపాలపల్లిలో 13.9, పెద్దపల్లిలో 14.2, మెదక్లో 14.3, ములుగు 14.6, యాదాద్రి 14.7, రాజన్న సిరిసిల్లలో 14.8, హనుమకొండ, మేడ్చల్ జిల్లాల్లో 14.9, జనగామలో 15 డిగ్రీల చొప్పున రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి.
మిగతా జిల్లాల్లో 16 నుంచి 20 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అత్యధికంగా సూర్యాపేటలో 19 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్ నమోదైంది. హైదరాబాద్లో మాత్రం రాత్రి వాతావరణంలో భిన్నమైన పరిస్థితులున్నాయి. పలు చోట్ల 15 నుంచి 17 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదవగా.. మిగతా చోట్ల 18 నుంచి 20 డిగ్రీలదాకా రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.