- రెండు జిల్లాలు మినహా అంతటా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు
- 20 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా నమోదు.. అత్యధికంగా జగిత్యాలలో 41.7 డిగ్రీలు
- దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పెరుగుతున్న నైట్ టెంపరేచర్లు
- వచ్చే రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం సలసలా మసిలిపోతున్నది. ఎండలు తీవ్రమవుతున్నాయి. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా మంట, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ను దాటేశాయి. అందులో 20 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇటు రాత్రి ఉష్ణోగ్రతలు సెంట్రల్, సౌత్ జిల్లాల్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్లోనే హయ్యెస్ట్ కావడం గమనార్హం. ఇక, శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా గుళ్లకోటలో 41.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఖమ్మం జిల్లా గుబ్బగుర్తి, ములుగు జిల్లా ఆలుబాక, నల్గొండ జిలా ఘనపూర్, నిర్మల్ జిల్లా మామడ, నిజామాబాద్ జిల్లా భీంగల్లో 41.6, కుమ్రంభీం ఆసిఫాబాద్ సిర్పూర్, మహబూబాబాద్ జిల్లా ఉప్పరగూడెం, మంచిర్యాల జిల్లా తాండూరు, నాగర్కర్నూలు జిల్లా ఎంగంపల్లి, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 41.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జయశంకర్భూపాలపల్లి, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి.
నైట్ టెంపరేచర్లు హైదరాబాద్లోనే ఎక్కువ
పగటి ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా నమోదైతే.. రాత్రి టెంపరేచర్లు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలోనే హయ్యెస్ట్ రికార్డ్ అయ్యింది. హైదరాబాద్ సిటీలోని వెస్ట్మారేడుపల్లిలో అత్యధికంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం నైట్ టెంపరేచర్లు 20 డిగ్రీలలోపే రికార్డ్అవుతున్నాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 17 డిగ్రీలు రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లాలో 18.4 డిగ్రీలుగా నమోదైంది. కాగా, వచ్చే రెండు వారాల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుందని
హెచ్చరించింది.
వర్షాలు తక్కువే..
రాష్ట్రంలో వర్షాకాలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులే ఉండబోతున్నాయి. స్కైమెట్తో పాటు తెలంగాణ వెదర్ మ్యాన్ మాన్సూన్ ఫోర్కాస్ట్లో ఈ విషయం వెల్లడైంది. ఎల్నినో అత్యంత తీవ్రంగా ఉంటుందని, హిందూ మహాసముద్రంలోనూ అదే పరిస్థితి ఉండబోతున్నదని ఫోర్కాస్ట్లో పేర్కొన్నారు. సాధారణం లేదంటే అంతకన్నా తక్కువ వర్షపాతమే ఈ సారి నమోదవుతాయని, 2018 నాటి పరిస్థితులే ఈ వర్షాకాలంలో ఉంటాయని తెలుస్తున్నది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
