మున్సిపల్ నామినేషన్ల విత్ డ్రాలో చివరి దాకా హైడ్రామా..

మున్సిపల్ నామినేషన్ల విత్ డ్రాలో చివరి దాకా హైడ్రామా..
  • నామినేషన్ల విత్​డ్రాలో టెన్షన్​ 
  • చివరి గంటలో బీఫామ్స్​అందజేత
  • టికెట్ రాని అభ్యర్థులు ఇడిపెండెంట్ గా బరిలో..

ఆదిలాబాద్ నెట్​వర్క్, వెలుగు: మున్సిపల్​ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్కంఠ మధ్య మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా హైడ్రామా నడిచింది. ఆయా పార్టీలు కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న క్యాండిడేట్లను ముందుగానే కన్​ఫామ్​ చేసినప్పటికీ బీఫామ్స్​ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొన్నది. నామినేషన్ల విత్​డ్రాకు మధ్యాహ్నం 3 గంటలకు వరకు గడువు ఉండగా, చివరి నిమిషం వరకూ టెన్షన్​ వాతావరణం కనిపించింది.

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు కాంగ్రెస్ అభ్యర్థులను నాలుగు రోజుల కిందటే ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ, బీఆర్​ఎస్​అభ్యర్థుల లిస్టు రిలీజ్​ చేయకపోవడంతో బీఫామ్స్​ పెండింగ్​ పెట్టాయి. ఆ రెండు పార్టీలు కూడా ఇదే ఫాలో అయ్యాయి.

ముందుగానే క్యాండిడేట్లను ప్రకటిస్తే టికెట్​దక్కని వారు కాంగ్రెస్​లోకి వెళ్లే ప్రమాదం ఉందని లిస్టును సీక్రెట్​గా ఉంచాయి. మధ్యాహ్నం వరకూ రెబల్స్​తో మంతనాలు జరిపి, బుజ్జగించి, బెదిరించి నామినేషన్లు విత్​డ్రా చేయించడంలో సక్సెస్​ అయ్యారు. చివరి గంటలో ఆయా పార్టీలు బీఫామ్స్​ అందజేసి ఉత్కంఠకు తెరదించాయి.

క్యాంప్​ ఆఫీస్ వద్ద లొల్లి 

బెల్లంపల్లి లో కాంగ్రెస్​ టికెట్ల కోసం ఎమ్మెల్యే గడ్డం వినోద్​ క్యాంప్​ ఆఫీస్ దగ్గర మధ్యాహ్నం వరకు లొల్లి కొనసాగింది. చివరకు పార్టీ లీడర్ల ద్వారా ఎన్నికల అధికారులకు కాంగ్రెస్​ బీఫామ్స్​ అందజేశారు. క్యాతనపల్లి, చెన్నూర్​ మున్సిపాలిటీల్లో మంత్రి వివేక్​ వెంకటస్వామి బుజ్జగింపులు ఫలించాయి. టికెట్లు రానివారికి కో ఆప్షన్, నామినేటెడ్​ పోస్టులు ఇస్తామని హామీ ఇవ్వడంతో రెబల్స్​ పోటీ నుంచి తప్పుకున్నారు. 

బీజేపీ, బీఆర్​ఎస్​కు కరువైన అభ్యర్థులు

మంచిర్యాల కార్పొరేషన్ 53వ డివిజన్​బీజేపీ అభ్యర్థి బోయిని లలిత బీసీ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్​ రిజెక్ట్​ అయ్యింది. 54వ డివిజన్​ బీజేపీ అభ్యర్థి, 10వ డివిజన్​ బీఆర్ఎస్​అభ్యర్థి నామినేషన్లు విత్​డ్రా చేసుకొని పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో రెండు చోట్ల బీజేపీకి, ఒక డివిజన్​లో బీఆర్​ఎస్​కు క్యాండిడేట్లు కరువయ్యారు. బీఆర్​ఎస్​, బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్​ వలలో పడకుండా కాపాడుకోవడానికి ఆ రెండు పార్టీలు నానా పాట్లు పడ్డాయి. పార్టీల నుంచి టికెట్ వస్తుందనే ఆశతో కొంత మంది నామినేషన్ వేసినప్పటికీ టికెట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్​గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగ పడ్డ అభ్యర్థులు తాము ఎన్నికల బరిలో ఉంటామని స్పష్టం చేశారు.

బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు 

మంచిర్యాల కార్పొరేషన్​ పరిధిలోని 60 డివిజన్లకు 615 నామినేషన్లు రాగా, వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు 240 మంది పోటీలో ఉన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు 173 మంది, క్యాతనపల్లిలో 22 వార్డులకు 113 మంది, చెన్నూర్​లో 18 వార్డులకు 107 మంది, లక్సెట్టిపేటలో 15 వార్డులకు 60 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆసిఫాబాద్​లో 20 వార్డులకు 94 మంది, కాగజ్​నగర్​లో 30 వార్డులకు 130 మంది, నిర్మల్​లో 42 వార్డులకు 182 మంది, ఖానాపూర్​లో 12 వార్డులకు 56 మంది, భైంసాలో 115 మంది బరిలో ఉన్నారు.

మున్సిపాలిటీ    కాంగ్రెస్​    బీఆర్​ఎస్​    బీజేపీ    ఇతర    ఇండి    మొత్తం

మంచిర్యాల (కార్పొ)    59    58      58    46    19    240

బెల్లంపల్లి    34    34    20    18    66    173

క్యాతనపల్లి    22    22     15    19    35    113

చెన్నూర్​    18    18     18    15    38    107

లక్సెట్టిపేట    15    14     14    06    11    60

 ఆసిఫాబాద్    19    20    18    15    22    94

 కాగజ్ నగర్    29    30    30    18    23    130

నిర్మల్    42    36    42    35    27    182

భైంసా    24    15    12    18    46    115

ఖానాపూర్    12    12    12    14    16    56