- ఇబ్రహీంపట్నం, మణికొండలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, వికారాబాద్లో స్వల్ప ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య నెలకొన్న స్వల్ప వివాదం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. దీంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసేంత వరకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు.
చార్మినార్ అభ్యర్థి సోదరుడిపై దాడి
పాతబస్తీ హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు సలీంపై ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. చోటా బజార్లోని ఓషియన్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ స్టేషన్ను పరిశీలించడానికి వెళ్లిన సలీంకు.. అక్కడే ఉన్న ఎంఐఎం నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సలీంను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
డబ్బులు పంచుతున్నారని ఒకరిపై ఒకరు దాడి
రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆరోపించుకున్నారు. ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడున్న టేబుల్స్, కుర్చీలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్లోని కోటవిధిలో డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. పోలింగ్ సెంటర్ సమీపంలో రూ.7.45లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును ఈసీకి అప్పగించారు.