- ఇన్చార్జులుగా సెగ్మెంట్కో మంత్రి.. డివిజన్కో ఎమ్మెల్యే
- ఎన్నికలు ముగిసే దాకా సిటీలోనే ఉండాలని ఆదేశం!
- బీజేపీ బలంగా ఉన్న డివిజన్లపై నజర్
- 17 మంది మంత్రులు, 85 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలకూ బాధ్యతలు
- ఇటు ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తూ.. అటు బలగాన్ని మోహరిస్తున్న టీఆర్ఎస్
హైదరాబాద్, వెలుగు:దుబ్బాక ఓటమితో షాక్కు గురైన టీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల భయం పట్టుకుంది. ఈ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకోవడం, ఎన్నికల స్ట్రాటజిస్ట్ భూపేంద్ర యాదవ్ను రంగంలోకి దింపడంతో గులాబీ టీం కలవరపడుతున్నది. బీజేపీ స్పీడ్ను కట్టడి చేసేందుకు నానా తంటాలు పడుతున్నది. ఇందులో భాగంగా ఓటర్లకు భారీగా తాయిలాలు ఇవ్వటంతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ లీడర్లందరినీ గ్రేటర్ ఎన్నికల్లో మోహరించాలని డిసైడ్ అయింది. సీఎం కేసీఆర్ మినహా 17 మంది మంత్రులు, 85 మంది ఎమ్మెల్యేలు, 9 మంది లోక్సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు, 32 మంది ఎమ్మెల్సీలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. వీరంతా జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
కేటీఆర్ డైరెక్షన్
ఎన్నికల కోసం గ్రేటర్లోని నియోజకవర్గానికి ఓ మంత్రిని, డివిజన్ కు ఓ ఎమ్మెల్యేను నియమించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎవరు ఏ నియోజకవర్గం, ఏ డివిజన్ లో ఎన్నికల బాధ్యతలు చూడాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వారంతా తమకు అప్పగించిన నియోజకవర్గం, డివిజన్ నేతలతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. లోకల్ ఎమ్మెల్యే కో ఆర్డినేషన్ తో స్థానిక పరిస్థితులను ఆరా తీస్తున్నారు. బీజేపీ బలం ఏ మేరకు ఉందని, ఆ బలాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలని అడిగి తెలుసుకుంటున్నారు.భవిష్యత్ అవసరాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు డివిజన్ల బాధ్యతలను తగ్గించడమో, పెంచడమో చేయనున్నట్టు తెలిసింది.
బీజేపీ బలంగా ఉన్న చోట్ల స్పెషల్ ఫోకస్
జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ బలగా ఉన్న ఏరియాల్లో కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. గ్రేటర్ పరిధిలో 60 డివిజన్లలో బీజేపీ బలంగా ఉన్నట్టు టీఆర్ఎస్ గుర్తించింది. ప్రధానంగా ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, గోషామహల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు తోడు అదనంగా పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు అప్పగించింది.
గ్రేటర్లో మంత్రులకు అప్పగించిన నియోజకవర్గాలు
నియోజవర్గం మంత్రులు
ఎల్బీనగర్ జగదీశ్, సబిత, ఎర్రబెల్లి
ఉప్పల్ సత్యవతి, జగదీశ్
మల్కాజ్గిరి ఈటల రాజేందర్, కొప్పుల, మల్లారెడ్డి
కుత్బుల్లాపూర్ ప్రశాంత్ రెడ్డి
పటాన్ చెరు హరీశ్ రావు
ఖైరతాబాద్ ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
జూబ్లీహిల్స్ గంగుల కమలాకర్
కూకట్ పల్లి పువ్వాడ అజయ్
సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
ముషీరాబాద్ శ్రీనివాస్ గౌడ్
రాజేంద్రనగర్ మహమూద్ అలీ
మజ్లిస్కు బలం ఉన్న చోట ఇన్చార్జులు లేరు!
మజ్లిస్ పార్టీ బలంగా ఉన్న 40 డివిజన్లను మినహాయించి మిగతా 110 డివిజన్లకు టీఆర్ఎస్ ఇన్ చార్జు లను నియమించినట్టు గులాబీ లీడర్లు చెప్తున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 24అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఇందులో 7 నియోజకవర్గాల్లో ఎంఐఎం, ఒక చోట బీజేపీమిగతా 16 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు , గ్రేటర్ చుట్టున్న మేయర్లు , కార్పొరేషన్ చైర్మన్లు అందరూ జీహెచ్ ఎంసీ ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్ నుంచి ఎటు వెళ్లొద్దని టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.
అమిత్ షా సన్నిహితుడి నియామకంతో అలర్ట్
జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను ఎంపీ భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని జాతీయ కమిటీకి బీజేపీ హైకమాండ్ అప్పగించడంతో టీఆర్ఎస్ పెద్దలు అలర్ట్ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన ఆయనను రంగంలోకి దించడంపై గులాబీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వారు దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రచార వ్యూహాలను రచించడంలో భూపేంద్రకు మంచి పేరుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ నియమించే ఎలక్షన్ టీంలో ఆయన ఉంటారు. ఈ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించడం వెనుక భూపేంద్ర స్ట్రాటజీలు ఉన్నాయి. అంతకు ముందు 2013లో రాజస్థాన్, 2015లో గుజరాత్, 2014లో జార్ఖండ్, 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక కూడా ఆయన కృషి ఉంది.