తెలంగాణలో మార్చి 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్

తెలంగాణలో మార్చి 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
  • రాష్ట్రవ్యాప్తంగా 2676 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు 
  • అటెండ్ కానున్న 5.08 లక్షల మంది స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ నిర్వహణలో ఇబ్బందులు రావొద్దని, లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం  రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 2 వరకూ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సెంటర్లలో సౌకర్యాలపైనా దృష్టిసారించింది. 

రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది స్టూడెంట్లు టెన్త్ పరీక్షలకు అటెండ్ కానున్నారు. వీరి కోసం 2676 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. కాగా, టెన్త్ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి  మధ్యాహ్నం 12.30గంటల వరకూ కొనసాగనున్నాయి. అయితే, సైన్స్ సబ్జెక్టులో ఈ ఏడాది నుంచి బయాలజీ, ఫిజిక్స్ పేపర్లను రెండు వేర్వేరు రోజుల్లో  నిర్వహించనున్నారు. టైమింగ్ గంటన్నరనే ఉండనున్నది. ఈ నెల 26న ఫిజికల్ సైన్స్ పేపర్ ఉదయం 9.30గంటల నుంచి 11గంటల వరకూ, 28న బయాలాజికల్ సైన్స్ పేపర్ ఉదయం 9.30గంటల నుంచి 11గంటల వరకు ఉంటుంది. 

వెబ్ సైట్​లో హాల్ టికెట్లు 

టెన్త్ హాల్ టికెట్లు https://bse.telangana.gov.in వెబ్ సైట్​లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.