హైదరాబాద్, వెలుగు: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులో ప్రతిపాదించిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క ఎగ్జామ్ను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షగా, ఫారిన్ ఎంబీబీఎస్ చదివొచ్చినవారికి ఎగ్జిట్ ఎగ్జామ్గా, పీజీ అడ్మిషన్లకు ఎంట్రన్స్ ఎగ్జామ్గా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.
ఇకపై ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నెక్ట్స్ పాసైతేనే డాక్టర్ అవుతారు. ప్రస్తుతం ఫారిన్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాసైతేనే ప్రాక్టీస్ చేసేందుకు అనుమతినిస్తున్నారు. ఎన్ఎంసీ అమల్లోకి వస్తే ఫారిన్లో చదివినవాళ్లు కూడా ఎఫ్ఎంజీఈకి బదులు నెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. పీజీ అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న నీట్ ను రద్దు చేసి నెక్స్ట్లో సాధించిన మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తామని బిల్లులో పేర్కొన్నారు. దీన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్ 2లో తొలుత థియరీ ఎగ్జామ్స్ తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని, పీజీ సీటు కోసం ప్రయత్నిస్తున్న డాక్టర్ల సంఖ్య లక్షకుపైగా ఉంది. నెక్ట్స్ ఎగ్జామ్ రాయాలంటే వీళ్లంతా తిరిగి ఎంబీబీస్ సిలబస్ మొత్తం చదవాల్సి ఉంటుంది. ఒకసారి ఎంబీబీఎస్ పాసై వెళ్లిపోయాక మళ్లీ అవే పరీక్షలు, ప్రాక్టికల్స్ రాయడమేంటని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
అక్రమాలకు చాన్స్!
ప్రస్తుతం ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ను హెల్త్ యూనివర్సిటీలే కండక్ట్ చేస్తున్నాయి. ఏ వర్సిటీ పరిధిలోని కాలేజీలకు ఆ వర్సిటీలే ప్రశ్నపత్రాలు తయారు చేస్తాయి. ఆ వర్సిటీ పరిధిలోని కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్లే పేపర్లు కరెక్షన్ చేస్తారు. నీట్ తరహాలో నెక్ట్స్ నిర్వహిస్తామంటున్న కేంద్రం.. దాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. థియరీ ఎగ్జామ్ పెడితే మాల్ ప్రాక్టీస్కు, అక్రమాలకు అవకాశం ఉంటుందని, పేపర్ కరెక్షన్లోనూ తేడాలుంటాయన్నది డాక్టర్ల వాదన. పీజీ సీటుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీలు తమ విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడొచ్చని, దీంతో ప్రభుత్వ కాలేజీల్లో చదివే స్టూడెంట్స్ నష్టపోతారని డాక్టర్లు చెబుతున్నారు.