- రూ.60 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ
- కేటీఆర్ సమక్షంలో సర్కారుతో ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: సిరిసిల్లలో బట్టల తయారీ ఫ్యాక్టరీ పెట్టేందుకు టెక్స్పోర్ట్ సంస్థ ముందుకు వచ్చింది. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర సర్కారుతో ఎంవోయూ చేసుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రూ.175 కోట్లతో సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామంలోని 63 ఎకరాల్లో అపరల్ పార్క్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఈ పార్క్లో ఫ్యాక్టరీలు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. వస్త్రాల ఉత్పత్తి, ఎగుమతి చేసేలా బిల్ట్ టు సూట్ పద్ధతిలో దేశంలోనే మొదటి పార్క్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 7ఎకరాలకు పైగా స్థలంలో రూ.60 కోట్లతో టెక్స్పోర్ట్ సంస్థ ఫ్యాక్టరీ నిర్మించనుందని, ఈ సంస్థ ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 1978 నుంచి వస్త్ర తయారీ రంగంలో పనిచేస్తోందన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల పనితనం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని టెక్స్పోర్ట్ ఎండీ నరేంద్ర డి. గోయెంకా తెలిపారు.