
హైదరాబాద్: గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. 2025, మే 29వ తేదీ నుంచి 2025, జూన్ 10వ తేదీ వరకు గ్రూప్ 2 అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని తెలిపింది. హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపింది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ సంతకం చేసిన జిరాక్స్లు తీసుకురావాలని సూచించింది. నిర్ధిష్ట తేదీలలో ఏదైనా కారణం వల్ల సర్టిఫికేట్ హాజరుకాలేని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించామని.. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా.. ఇతర వివరాలు కావాలన్న కమిషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించింది టీజీపీఎస్సీ.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా 783 గ్రూప్– 2 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ 15, 16 తేదీల్లో ఎగ్జామ్ జరిగింది. దీనికి 5,51,855 మంది అప్లై చేసుకోగా.. వారిలో 2,49,964 మంది అభ్యర్థులు 4 పరీక్షలకు అటెండ్ అయ్యారు. వీరిలో 2,36,649 మందికి జనరల్ ర్యాకింగ్ లిస్ట్ను కమిషన్ ప్రకటించింది.
మరో 13,315 మంది క్యాండిడేట్ల పేపర్లు ఇన్వ్యాలిడ్అయ్యాయని వెల్లడించింది. 2025, మార్చి 11న ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. ఓఎంఆర్ షీట్, మాస్టర్క్వశ్చన్పేపర్ను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచింది.