
- కంబోడియా లీడర్తో థాయ్లాండ్ ప్రధాని ఫోన్ కాల్ వివాదాస్పదం
- రాజీనామా చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: ఒక్క ఫోన్ కాల్.. ప్రధాని పదవికే ఎసరు పెట్టింది. కంబోడియా లీడర్తో థాయ్లాండ్ పీఎం పేటోంగ్టార్న్ షినవత్రా మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ కావడం.. ఆమె పదవికే గండం తెచ్చిపెట్టింది. కుర్చీ నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అసలేం జరిగింది?
కంబోడియా ప్రధాని హున్ మానెట్ తండ్రి, మాజీ ప్రధాని హున్సేన్కు థాయ్ ప్రధాని షినవత్రా ఇటీవల ఫోన్ చేశారు. అంకుల్ అంటూ ఆయనను పిలిచిన ఆమె.. తమ దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్లాండ్ నార్త్ఈస్ట్ ఆర్మీ కమాండర్ తనకు ప్రత్యర్థి అని చెప్పారు. ఈ ఫోన్కాల్ లీక్ అయింది.
సరిహద్దు వివాదాల కారణంగా కంబోడియా, థాయ్లాండ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగుదేశం నేతతో ప్రధాని మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. షినవత్రా దేశం పరువు తీశారని, ఆర్మీ గౌరవం దెబ్బతీశారని జనం మండిపడుతున్నారు.
వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్జాయ్ థాయ్ పార్టీ బయటకొచ్చింది. దీంతో షినవత్రాకు స్వల్ప మెజార్టీ మాత్రమే మిగిలింది. మరికొంత మంది ఎంపీలు కూడా మద్దతు విరమించుకుంటే, ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి నెలకొంది. కాగా, తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ప్రజలకు షినవత్రా క్షమాపణలు చెప్పారు.