పైడి జైరాజ్ పేరిట అవార్డు నెలకొల్పిన CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు: పొన్నం రవిచంద్ర

పైడి జైరాజ్ పేరిట అవార్డు నెలకొల్పిన CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు: పొన్నం రవిచంద్ర

హైదరాబాద్: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‎లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్ ఇవ్వడం హర్షణీయమని నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పైడి  జైరాజ్ తొలి అవార్డును ప్రముఖ దర్శకులు మణిరత్నంకు ఇవ్వడం అభినందనీయమన్నారు. 

పైడి జైరాజ్‎పై పొన్నం రవిచంద్ర రూపొందించిన “ది ఇండియన్ ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జైరాజ్” టేబుల్ బుక్‎ను 2024 సెప్టెంబర్‎లో సీఎం రేవంత్ రెడ్డి  ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జైరాజ్ పేరిట జాతీయ అవార్డు నెలకొల్పి, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‎లో ఏర్పాటు చేయాలని  పొన్నం రవిచంద్ర సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించగా.. అందులో జైరాజ్ పేరిట కూడా అవార్డ్ నెలకొల్పింది. దీంతో తన విన్నపాన్ని మన్నించి జైరాజ్ పేరిట అవార్డు నెలకొల్పడం అభినందనీయమని, ఈ అవార్డు కార్యక్రమానికి జైరాజ్ కుటుంబసభ్యులను ఆహ్వానించి వారి సమక్షంలో అవార్డు ప్రదానం చేయాలని రవిచంద్ర కోరారు.

►ALSO READ | భైరవం మూవీకి పాజిటివ్ టాక్: ‘ఆయన కొడుకు వచ్చాడని చెప్పు’.. తండ్రి ఫొటోతో మంచు మనోజ్ పోస్ట్

పైడి జైరాజ్ జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి.. 2005 సంవత్సరం నుంచి వివిధ పత్రికలలో ఆయనపై అనేక వ్యాసాలు రాసిన రవిచంద్రను సీనియర్  జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు, జైరాజ్ కుటుంబ సభ్యులు కాసారం రమేష్, కవి రచయిత అన్నవరం దేవేందర్, మాడిశెట్టి గోపాల్, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ సభ్యులు అభినందించారు. 2018లో పైడి జైరాజ్‎పై డాక్యుమెంటరీని రూపొందించి 6 అంతర్జాతీయ అవార్డులు అందుకుని, జైరాజ్ పేరిట జాతీయ అవార్డు నెలకొలిపేలా పొన్నం రవిచంద్ర చేసిన కృషి అభినందనీయమన్నారు.