పేకాటలో హైటెక్ మోసం

పేకాటలో హైటెక్ మోసం
  • పేకాటలో హైటెక్ మోసం
  • గేమ్​ కార్డులకు ఎలక్ట్రానిక్ డివైజ్​లు పెట్టి బెట్టింగ్​లో ఫ్రాడ్
  • ప్రధాన నిందితుడితో పాటు ఐదుగురి అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు :  ఫ్లాట్​లో పేకాట బెట్టింగ్​లు నిర్వహించడంతో పాటు ఎలక్ట్రానిక్​ డివైజ్​లతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు ఐదుగురిని బాలానగర్ ఎస్ వోటీ, బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాస్​రావు బుధవారం వివరాలు వెల్లడించారు. ఒంగోలుకు చెందిన మలిపేడి అవినాశ్​కుమార్(35) బాచుపల్లి  మయూరా ఫార్చూన్ గ్రీన్​హౌస్​లో  ప్లాట్​ నంబర్ 201లో ఉంటున్నాడు.​  ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న అవినాశ్ కుమార్ తన ఫ్లాట్​లో పేకాట క్లబ్​ ఏర్పాటు చేశాడు. ట్రాన్స్ మీటర్, స్కానింగ్​ డివైజ్​, మైక్రోఫోన్లతో ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులను పేకాడేందుకు వచ్చిన వారికి ఇచ్చేవాడు.

తర్వాత పేకాటపై బెట్టింగ్​ నిర్వహించేవాడు. ఎలక్ట్రానిక్ డివైజెస్​ సాయంతో బెట్టింగ్​లో ఎవరు గెలుస్తారు.. ఎంత బెట్టింగ్​ వేయాలో ప్లాన్​ చేసి మోసం చేసేవాడు. పేకాట క్లబ్​ గురించి సమాచారం అందుకున్న బాలానగర్​ఎస్​వోటీ, బాచుపల్లి పోలీసులు బుధవారం సాయంత్రం అవినాశ్​కుమార్ ఫ్లాట్​పై దాడులు చేశారు. అవినాశ్​తో పాటు పేకాడుతున్న  నిజాంపేటకు చెందిన దండు రాజేశ్​ (39),  బహదూర్​పల్లికి చెందిన గప్ప నరేష్​కుమార్(48), ఈస్ట్​గోదావరికి చెందిన సోడి శెట్టి రాఘవ(32), నెల్లూరుకి చెందిన తన్నీరు కోటేశ్వరావు(40), వెస్ట్​గోదావరికి చెందిన బాదారు గంగరాజు(44)ను అరెస్ట్​ చేశారు.   3 మైక్రోఫోన్లు, ట్రాన్స్​ మీటర్​ డివైజ్​,7 సెల్​​ఫోన్లు​, 12 సెట్ల స్పెషల్​ స్కానింగ్​ ప్లేకార్డ్స్​,   రూ. 29 లక్షలకుపైగా క్యాష్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.