న్యూఇయర్​కు డ్రగ్స్​ప్లాన్..​ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

న్యూఇయర్​కు డ్రగ్స్​ప్లాన్..​ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
  • న్యూఇయర్​కు డ్రగ్స్​ప్లాన్​
  • అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు​
  • బస్సు ద్వారా మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నట్లు గుర్తింపు
  • రూ.56 లక్షలు విలువైన 3.5 కిలోల ఓపీఎం, రూ.2.8 లక్షలు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన సీపీ సుధీర్​బాబు

హైదరాబాద్ : న్యూఇయర్ వేడుకలకు డ్రగ్స్ అమ్మేందుకు ప్లాన్ చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నిందితుల వద్ద నుంచి రూ.56 లక్షలు విలువైన 3.5 కిలోల ఓపీఎం, రూ.2.8 లక్షల నగదును  స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. అంతర్రాష్ట్ర గ్యాంగ్ డ్రగ్స్‌ను రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్‌‌లో అమ్మాలని చూస్తున్నారని తెలిపారు.  

కుషాయిగూడ, మల్కాజిగిరి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఇద్దరు నిందితులు శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ బాయ్‌లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.56 లక్షలు విలువ చేసే ఓపీఎం డ్రగ్ 3.5 కేజీలు, 45 గ్రాముల పప్పీ స్ట్రాప్ పౌడర్‌, రూ.2.8 లక్షలు నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని.. బస్సు ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తెస్తున్నారన్నారు. డ్రగ్స్‌ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.