- సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో తలనీలాల సేకరణ టెండర్ ను సవాల్ చేస్తూ దురై ఎంటర్ప్రైజెస్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ, టెండర్ ప్రక్రియను డివిజన్ బెంచ్ సమర్థించింది. ఆ తీర్పులో జోక్యం చేసుకోలేని స్పష్టం చేసింది. తలనీలాల టెండర్ పిటిషన్ ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీల్ పిటీషన్ జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో కూడిన డివిజన్ బెంజ్ విచారించింది.
పిటిషనర్ తరపు అడ్వకేట్ వాదిస్తూ.. ప్రాసెస్ చేయని తలనీలాలను సేకరించి వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోవాలని, దేవాదాయ శాఖ పలుమార్లు టెండర్లు పిలిచినా బిడ్డర్లు రాలేదని, ఆరవ సారి నిర్వహించిన టెండరును ఖరారు చేయడం చెల్లదని తెలిపారు.దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ.. తలనీలాల సేకరణ టెండరును కళావతి ఎంటర్ప్రైజెస్ దక్కించుకుందని, పిటిషనర్ టెండర్లో పాల్గొనలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. టెండర్లో పాల్గొనకుండా పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని పేర్కొంటూ తీర్పు వెలువరించింది.
