యూపీలో మరో గ్యాంగ్ స్టర్ నేత ఇళ్లు కూల్చివేత.. 

యూపీలో మరో గ్యాంగ్ స్టర్ నేత ఇళ్లు కూల్చివేత.. 

గోర‌ఖ్‌పూర్‌ : కరడుగట్టిన నేరస్తులు, గ్యాంగ్ స్టార్లపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో మాఫియా నేత ఇంటిని అధికారులతో కూల్చివేయించింది యూపీ ప్రభుత్వం. ఉత్తర‌ప్రదేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌కు చెందిన మాఫియా వినోద్ ఉపాధ్యాయ ఇంటిని శనివారం (జూన్ 17న) అధికారులు కూల్చేశారు. రౌడీ షీట‌ర్ వినోద్‌ ఉపాధ్యాయపై 25 కేసులు ఉన్నాయి. బెదిరింపులు, హ‌త్యాయ‌త్నం లాంటి కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌. అత‌నిపై త‌ల‌పై 50 వేల రివార్డు కూడా ఉంది.

ప్రస్తుతం వినోద్ ఉపాధ్యాయ ప‌రారీలో ఉన్నాడు. శనివారం ఉద‌యం (జూన్ 17న) గ్యాంగ్‌స్టర్ వినోద్ ఇంటికి చేరుకున్న అధికారులు ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి తాళాలను పగులగొట్టారు. వినోద్ త‌మ్ముడు సంజ‌య్ ఉపాధ్యాయ‌పై కూడా హిస్టరీ షీట్ ఉంది. ఆ ఇద్దరు సోద‌రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూపీలో ఉన్న 61 మంది మాఫియా ప్రధాన వ్యక్తులో వినోద్ ఒక‌డు. 2014లో అత‌నిపై హ‌త్యాయ‌త్నం కేసు బుక్ చేశారు. అయితే.. బెయిల్‌పై రిలీజైన త‌ర్వాత  ప‌రారీ అయ్యాడు.

వినోద్ ఉపాధ్యాయ్‌పై నాలుగు హత్య కేసులతో సహా 32 కేసులు నమోదై ఉన్నాయని  సిటీ ఎస్పీ క్రిష్ణన్ బిష్ణోయ్ చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో పాటు తన నివాసానికి ఆనుకున్న ప్లాట్‌ను కూడా అతను ఆక్రమించుకున్నాడని తెలిపారు. కోట్లాది రూపాయలతో బిల్డింగ్ కట్టాడని, ఆక్రమిత ప్రభుత్వ భూమిని గోరఖ్‌పూర్ డెవలప్ అథారిటీ గుర్తించి కూల్చివేతలు చేపట్టినట్టు చెప్పారు. 

ఉపాధ్యాయ్ కోసం గాలింపు చర్యలు జరుపతున్నాయని, అతని అరెస్టు కోసం ప్రకటించిన రివార్డును కూడా పెంచనున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఆక్రమణల కూల్చివేతల్లో భాగంగా మాఫియా వినోద్ ఉపాధ్యాయ నివాసాన్ని కూల్చివేశారు.  ప్రహారీగోడలను బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు.