
- కేటీఆర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవట్లే
- రైతు భూమిని కలిపేసుకుని రియల్టర్ అక్రమ లేఔట్
- అధికారులు పట్టించుకోవట్లేదంటూ మంత్రికి ట్విట్టర్లో ఫిర్యాదు
- అయినా పరిష్కరించడం లేదంటున్న బాధితుడు భిక్షపతి
షాద్ నగర్, వెలుగు: తన భూమిపై ఓ రియల్టర్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడని, దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఓ రైతు ఆరోపించాడు. తన సమస్యపై మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ఫిర్యాదు చేశానని, కేటీఆర్ అధికారులను ఆదేశించినా వారు స్పందించడం లేదని అతడు మంగళవారం మీడియాతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ మున్సిపాలిటిపరిధి ఫరూఖ్నగర్లోని సర్వే నంబర్ 363/ఆ లో మోడంపల్లి భిక్షపతికి వారసత్వంగా వచ్చిన ఎకరం30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దీని పక్కనే ఉన్న భూమిలో ఓ రియల్టర్ వెంచర్ వేసి భారీగా విల్లాలు నిర్మించాడు. రెండేళ్ల కిందట రైతు భిక్షపతి అనుమానించి రిజిస్ట్రేషన్ఆఫీసులో ఈసీ (ఎన్కంబరెంట్ సర్టిఫికెట్) తీయగా తన భూమిని కూడా కలిపి వెంచర్గా చేసినట్టు తేలింది. అంతేకాకుండా తన భూమి పది శాతం మున్సిపాలిటీ లే ఔట్ కిందకు వెళ్లినట్టు తేలడంతో అక్రమ లే ఔట్పై అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. దీంతో గత మే 31న మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై మంత్రి స్పందించి హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించగా భూమి వద్దకు వెళ్లి పరిశీలించారని, ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యను అడిగితే భిక్షపతి భూమికి సంబంధించి అక్రమ లే ఔట్పై వచ్చిన ఫిర్యాదును హెచ్ఎండీఏ అధికారులకు పంపానని, ఉత్తర్వులు రాగానే ఎంక్వైరీ చేస్తామన్నారు. కొందరు రియల్టర్లు రైతుల భూములపై వారికి తెలియకుండానే పేపర్లు సృష్టించి కబ్జాకు యత్నిస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు విమర్శించారు.