- ప్రాణాలతో బయటపడ్డ పెళ్లికొడుకు, అతడి అక్క
- వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వద్ద ప్రమాదం
- వేర్వేరు చోట్ల వాగుల్లో పడి మరో ఇద్దరు గల్లంతు
వికారాబాద్ జిల్లా, వెలుగు: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వద్ద కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నవ వధువు సహా ముగ్గురు గల్లంతయ్యారు. మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్ రెడ్డికి మోమిన్పేటకి చెందిన ప్రవళికతో ఈ నెల 25న వివాహమైంది. ఆదివారం మోమిన్ పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా తిమ్మాపూర్ వద్ద ప్రమాదం జరిగింది. కారులో నవాజ్ రెడ్డి, ఆయన భార్య ప్రవళిక, అక్కలు రాధమ్మ, శృతితోపాటు డ్రైవర్ రాఘవేంద్రరెడ్డి ఉన్నారు. ప్రమాదంలో ప్రవళిక, శృతి, డ్రైవర్ రాఘవేంద్రరెడ్డి గల్లంతు కాగా.. నవాజ్రెడ్డి, రాధమ్మ క్షేమంగా బయటపడ్డారు.
కొత్తపల్లి వాగులో కారు బోల్తా.. ఒకరు గల్లంతు
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి వాగులో కారు బోల్తా పడింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ఉండగా.. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు. వీరంతా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.
బైక్పై వాగు దాటుతూ మరొకరు
వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలంలోని ఫుల్ మామిడికి చెందిన చాకలి శ్రీను (40).. వాగులో కొట్టుకుపోయాడు. ఆదివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి పనిమీద వెళ్లిన శ్రీను.. బైక్పై హనుమాన్ మందిర్ దగ్గర వాగు దాటుతుండగా ప్రమాదం జరిగింది. పట్టు తప్పి వరదలో కొట్టుకుపోయాడు. స్థానికులు సాయం చేసే లోపే గల్లంతయ్యాడు.