ఎంపీ ప్రభాకర్​రెడ్డిపై దాడి చేసిన నిందితుడి కారుకు నిప్పు

ఎంపీ ప్రభాకర్​రెడ్డిపై దాడి చేసిన నిందితుడి కారుకు నిప్పు
  • అద్దాలు పగలగొట్టి, కాల్చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

దుబ్బాక, వెలుగు:మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి  పాల్పడిన నిందితుడి కారును గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. దౌల్తాబాద్​ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీపై గటని రాజు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. మిరుదొడ్డి మండలం చెప్యాలలో రాజు తన ఇంటి వద్ద పార్క్ చేసిన (ఏపీ09 బీడీ 3119) కారును మంగళవారం దహనం చేశారు. కారు అద్దాలను పగుల కొట్టి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. సగం వరకు కాలిపోయిన కారును మిరుదొడ్డి పోలీస్ స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై.నరేశ్ తెలిపారు.