- రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసిన కేంద్రం
- 15వ ఆర్థిక సంఘం నిధులపై పంచాయతీరాజ్ శాఖ గైడ్లైన్స్
- గ్రామాల్లో మౌలిక వసతులకే ఈ ఫండ్స్వినియోగించాలి
- యూసీలు పంపి, ఆడిట్ చేస్తేనే మిగిలిన
- రూ.2వేల కోట్ల బకాయిలు చెల్లించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి బకాయిపడిన15వ ఆర్థిక సంఘం నిధులను ఇటీవల విడుదల చేసిన కేంద్రం.. వాటి వినియోగానికి తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం10 రోజుల్లోగా ఫండ్స్ను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమచేయాలని, లేట్ చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నిధుల వినియోగంపై పంచాయతీరాజ్శాఖ కూడా తాజాగా గైడ్లైన్స్ ఇచ్చింది.
గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంటర్నల్రోడ్ల మరమ్మతులు, తదితర మౌలిక వసతులకే ఈ ఫండ్స్వినియోగించాలని సూచించింది. ఇప్పటికే వచ్చిన నిధుల వినియోగం తర్వాత అందుకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను(యూసీల)ను పంపి, ఆడిట్చేస్తేనే మిగిలిన రూ.2వేల కోట్ల బకాయిలు చెల్లించే చాన్స్ఉందని అధికారులు చెప్తున్నారు.
రెండు రకాలుగా నిధుల విభజన
కేంద్రం నుంచి ఇప్పటి వరకూ 3 విడతల్లో రూ.1,034.42 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఫండ్స్ను పంపిణీ చేస్తున్నారు. నిధుల పంపిణీలో సింహభాగం గ్రామపంచాయతీలకే కేటాయిస్తున్నారు. మొత్తం నిధుల్లో జీపీలకు 85 శాతం, మండల పరిషత్లకు 10 శాతం, జిల్లా పరిషత్లకు 5 శాతం చొప్పున ఇస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలైన నిధులను 10 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా సంబంధిత గ్రామ, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయాలి.
ఒకవేళ 10 రోజులు దాటితే ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజులకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీతో సహా ఆ నిధులను లోకల్ బాడీలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మండల, జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరగలేదు. కాబట్టికి వాటికి నిధులు రాలేదు. ఒకవేళ ఎన్నికలు జరిగి నిధులు వస్తే ఇదే పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను 2 రకాలుగా విభజించి ఖర్చు చేస్తారు. బేసిక్, టైడ్ గ్రాంట్స్గా వీటిని విభజించారు. టైడ్ గ్రాంట్లు 60 శాతం, అన్ టైడ్ గ్రాంట్లు 40 శాతం కేటాయించారు.
ఇందులో టైడ్ గ్రాంట్లు 60 శాతం నిధులను నీటి సరఫరా, పారిశుధ్యంకోసం వినియోగించనున్నారు. గ్రామంలోని ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునరుత్పత్తి పనులు చేపట్టనున్నారు. గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహితం (ఓడీఎఫ్)గా తీర్చిదిద్దడంతోపాటు తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు ఈ ఫండ్స్ను వినియోగించనున్నారు. వీటిని వేరే పనులకు మళ్లించడానికి వీల్లేదు.
మిగిలిన రూ.2 వేల కోట్లు రావాలంటే ఇవి తప్పనిసరి..
15 వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటి వరకూ 3 విడతలు మంజూరయ్యాయి. మొదటి విడతలో రూ. 323.44 కోట్లు, రెండో విడతలో రూ.323.45 కోట్లు, మూడో విడత రూ.387.53 కోట్లను కేంద్రం విడుదల చేసింది. మూడు విడతలు కలిపి మొత్తం రూ.1,034.42 కోట్ల నిధులు వచ్చాయి. ఇంకా రాష్ట్రానికి సుమారు రూ.2 వేల కోట్లు రావాల్సి ఉంది. ఇవి విడుదల కావాలంటే.. వచ్చిన నిధులు ఖర్చుకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) వెంటనే కేంద్రానికి పంపాలి.
ప్రతి గ్రామ పంచాయతీ లెక్కలను ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో ఆడిట్ పూర్తి చేయాలి. అయితే, ఆడిట్ పూర్తికాని గ్రామాలకు నిధులు రావు. గ్రామ ప్రణాళిక (జీపీడీపీ) వివరాలను వెబ్సైట్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఇలా చేస్తే మరో విడత నిధులు విడుదలవుతాయని పంచాయతీరాజ్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన
అన్టైడ్ గ్రాంట్లకు నిర్దిష్టమైన షరతులేమీ లేవు. కొన్ని మినహాయింపులున్నాయి. వీటిని గ్రామ అవసరాలకు తగ్గట్టుగా గ్రామసభ తీర్మానం మేరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వీటిని ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులు, పార్క్ ల అభివృద్ధి, వైకుంఠధామాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు, అంగన్వాడీలు, పాఠశాలలులాంటి ప్రభుత్వ భవనాల్లో మరమ్మతులతోపాటు ఇతర 29 రకాల అభివృద్ధి పనులకు వినియోగించవచ్చు.
అయితే.. ఈ సారి ఇంకుడు గుంతలు, అంగన్వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణంతోపాటు ఇతర పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. పారిశుధ్య కార్మికులకు మాస్క్లు, గమ్ బూట్లులాంటి రక్షణ పరికరాల కొనుగోలు, డస్ట్ బిన్ల ఏర్పాటు, డ్రైనేజీల నిర్మాణం, బయోగ్యాస్ ప్లాంట్ల నిర్వహణకు వినియోగించుకోవచ్చు. కాగా, మండల, జిల్లా పరిషత్లకు వచ్చే నిధుల్లో అన్టైడ్ గ్రాంట్స్ను కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని సైన్స్ ల్యాబ్ల అభివృద్ధికి, సైన్స్ పరికరాల కొనుగోలుకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. తద్వారా గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నది ఉద్దేశం. అయితే, మండల, జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరగకపోవడంతో వాటికి సంబంధించిన నిధులు రాలేదు.
