రూ.50కోట్ల కేంద్ర నిధులతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి

రూ.50కోట్ల కేంద్ర నిధులతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. కేంద్ర టూరిజం శాఖ ప్రసాద్(పిలిగ్రిమేజ్​రెజువెనేషన్​అండ్ స్పిర్చువల్ అగ్​మెంటేషన్ డ్రైవ్) స్కీం కింద రిలీజ్​చేసిన ఈ ఫండ్స్​తో రామాలయంతోపాటు పర్ణశాలలో పనులు చేపట్టనున్నారు. ‘భద్రాద్రి రాముడు.. తెలంగాణ దేవుడు’ అంటూ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్​నేతలు నినదించగా, కేసీఆర్ సీఎం హోదాలో మొదటిసారి భద్రాచలం వచ్చినప్పుడు రూ.100కోట్లతో రామాలయాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తర్వాత పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం 2017లో రామాయణం సర్క్యూట్​ స్వదేశీ దర్శన్ పేరుతో రూ.30 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్​రిపోర్టు) ఇవ్వకపోవడంతో అవి వెనక్కి పోయాయి. ఎంపీ కిషన్​రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయ్యాక చొరవ తీసుకుని భద్రాద్రి రామయ్య ఆలయం అభివృద్ధికి పూనుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెలలో రాష్ట్రానికి రానున్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చిన టైంలో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

చేపట్టే పనులివే..

గోదావరి వంతెన దాటి భద్రాచలం టౌన్​లోకి ఎంటర్​అయ్యేచోట ముఖద్వారంగా రాయితో ఆర్చీ నిర్మించనున్నారు. ఆలయ మాఢ వీధుల్లో స్మార్ట్ పోల్స్, పాత్​వే, వీధుల సుందరీకరణ, ప్రధాన ఆలయంలో ఫ్లోరింగ్, రెయిలింగ్, నిత్య కల్యాణ మండపం, ఆంజనేయస్వామి ఆలయం పరిసరాల్లో రూఫింగ్, మిథిలాస్టేడియం ఏరియాలో భక్తులకు ఏర్పాట్లు, భక్తుల కోసం బ్యాటరీ కార్లు, టెంపుల్​లో డైనమిక్​ లైటింగ్ సిస్టం, సీసీ టీఈలు, ప్రసాదాల తయారీ కేంద్రం ఆధునీకరణ, పిలిగ్రిమ్ అమినిటీ సెంటర్, వ్రత మండపం పనులు చేపట్టనున్నారు. 

పర్ణశాలలో..

భద్రాచలం దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్ణశాలలోనూ ప్రసాద్ ఫండ్స్ తో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అక్కడ కూడా పిలిగ్రిమ్​ అమినిటీ సెంటర్, సోలార్​స్ట్రీట్ లైట్లు, టెంపుల్​ఏరియాలో సోలార్ లైటింగ్, క్యూలైన్లు ఆధునీకరణ, రామకోటి స్తూపం వద్ద ఫ్లోరింగ్, జంక్షన్​లో సోలార్​ లైటింగ్, సీతవాగు వద్ద షాపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, తాత్కాలిక రెయిన్ షెల్టర్ల నిర్మాణం, బయోటాయిలెట్లు, సోలార్​లైట్ పోల్స్ ఇలా భక్తుల కోసం సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తం రూ.92.4 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపగా తొలిదశలో రూ.50 కోట్లు మంజూరయ్యాయి.

ఎన్ఓసీలు వచ్చినయ్

గోదావరి వారధి దాటి భద్రాచలంలోకి ప్రవేశించే చోట విజయవాడ-–జగదల్​పూర్​నేషనల్​హైవేపై ఆర్చీ నిర్మించేందుకు నేషనల్ హైవేస్​విభాగం నుంచి, భద్రాచలం దేవస్థానం నుంచి, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో పనులకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు  తీసుకోవాల్సి ఉంది. ఈ మూడు శాఖల నుంచి రాష్ట్ర టూరిజం ఆఫీసర్లు బుధవారం ఎన్ఓసీలు( నో అబ్జెక్షన్​సర్టిఫికేట్) తీసుకున్నారు.