
- త్వరలో ఐఏఎస్, ఐపీఎస్లకు నోటీసులు..
- రాష్ట్రంలో డ్రగ్స్, అవినీతిపై ప్రధాని మోడీ,
- హోంమంత్రి అమిత్షాకు తమిళిసై రిపోర్ట్
న్యూఢిల్లీ, వెలుగు: రాజ్భవన్ ఆదేశాలు లెక్కచేయని వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు ఢిల్లీలోనే ఉన్న గవర్నర్ తమిళిసై.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వేర్వేరుగా కలిశారు. రాష్ట్రంలో తనకు జరుగుతున్న అవమానాలతో పాటు డ్రగ్స్ కేసులు, అవినీతిపై స్పెషల్ రిపోర్టులు అందజేశారు. గవర్నర్ పర్యటనల్లో ఆఫీసర్లు ప్రొటోకాల్ ఉల్లంఘించడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ను అవమానించటం తమను అవమానించినట్లేనని కేంద్ర హోం మంత్రి అభిప్రాయపడ్డట్లు సమాచారం. నేరుగా ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది.
రాజ్భవన్ ఆదేశాలను పట్టించుకోని ఆఫీసర్లు
కొంతకాలంగా గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చే ఆదేశాలను.. గవర్నర్ టూర్లను రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్లు లెక్కచేయటం లేదు. కొన్నిరోజులుగా రాజ్భవన్లో ఏ వేడుకకు కూడా సీఎంతో పాటు మంత్రులెవరూ హాజరుకావడం లేదు. గవర్నర్ అటెండయ్యే ప్రోగ్రామ్లకు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు దూరంగా ఉంటున్నారు. మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ ఫెసిలిటీని గవర్నర్ కోరగా ప్రభుత్వం నిరాకరించింది. జాతరకు రోడ్డు మార్గంలో వెళ్లిన గవర్నర్ను ఆఫీసర్లు రిసీవ్ చేసుకోకపోవటం వివాదాస్పదమైంది. ప్రొటోకాల్ ప్రకారం స్వాగతించాల్సిన ట్రైబల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ గవర్నర్ వస్తున్నారని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇటీవల యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లిన గవర్నర్కు అదే పరిస్థితి రిపీటైంది. అక్కడ భువనగిరి జిల్లా కలెక్టర్, ఎస్పీ రిసీవ్ చేసుకోలేదు. ఆలయ ఈవో కూడా అక్కడ లేకపోవటం వార్తల్లోకెక్కింది. గవర్నర్ పర్యటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘించిన ఆఫీసర్లందరికీ కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసి, వివరణ కోరే అవకాశాలున్నాయి. గవర్నర్ను అవమానించిన ఘటనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఆఫీసర్లలో టెన్షన్ మొదలైంది. ఇక్కడి రాజకీయాలకు అడకత్తెరలో పోక చెక్కలా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య దూరం, గవర్నర్ను అవమానిస్తున్న తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ఢిల్లీ తెలంగాణ భవన్లోనూ పట్టించుకోలె
సాధారణంగా ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర గవర్నర్ను అక్కడి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్కు కమిషనర్ స్వాగతం పలుకలేదు. రెండు రోజులుగా భవన్లోని శబరి బ్లాక్లో గవర్నర్ ఉంటున్నా ఆ వైపు చూడలేదు. ఈ విషయం కూడా ప్రొటోకాల్ వివాదానికి తావిచ్చింది. సీఎం ఢిల్లీలో ఉన్నందుకు తాను రాలేకపోతున్నట్లు రెసిడెంట్ కమిషనర్ ముందుగానే సమాచారం ఇచ్చినట్లు ఢిల్లీ తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.