- ఎందుకు అప్పులు ఇచ్చారో వివరణ ఇవ్వాలని ఆదేశం
- కాళేశ్వరం థర్డ్ టీఎంసీ, పాలమూరు అప్పులపై ఫోకస్
- ఇరకాటంలో కేసీఆర్, ఆర్ఈసీ, పీఎఫ్సీ
హైదరాబాద్, వెలుగు: పర్మిషన్లు లేని ప్రాజెక్టులకు లోన్లు ఎలా ఇస్తారని ఫైనాన్స్ సంస్థలను కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ నిలదీసింది. కాళేశ్వరం థర్డ్ టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు ఎందుకు అప్పులు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విభాగం ఇటీవల ‘రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)’లకు లెటర్లు రాసింది.ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలు ఇస్తున్న అప్పుల విషయంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గతంలో కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీకి లెటర్ రాశారు. దానిపై స్పందించిన కేంద్రం.. అప్పుల వివరాలు ఇవ్వాలని, అప్పు ఇచ్చేందుకు ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది.
కాళేశ్వరం థర్డ్ టీఎంసీ పనులపై నజర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అడిషనల్ టీఎంసీ పనులకు అన్ని పర్మిషన్లు తీసుకోవాలని కేంద్రం గతంలోనే ఆదేశించింది. ఆ పనుల ద్వారా కొత్తగా ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుందన్న వివరాలన్నీ చెప్పాలని.. అండర్ టన్నెళ్లు కాకుండా పైపులైన్లు ఎందుకు వేయాల్సి వస్తుందో వివరణ ఇవ్వాలని అడిగింది. ఇదే సమయంలో అడిషనల్ టీఎంసీ పనులకు ఫైనాన్స్ చేస్తున్న సంస్థలపై దృష్టి సారించింది. దీంతో సీఎం కేసీఆర్తోపాటు రెండు ఫైనాన్స్ కార్పొరేషన్లు ఇరకాటంలో పడ్డాయి.
కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి ఆర్ఎఫ్సీ..
కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులకు ఆర్ఎఫ్సీ రూ.27 వేల 310 కోట్ల అప్పు ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి థర్డ్ టీఎంసీ ఎత్తిపోసే పనులకు ఇప్పటికే రూ.4,500 కోట్లు ఖర్చు చేశారు. అందులో కొంత మేర బిల్లులు కూడా చెల్లించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు థర్డ్ టీఎంసీ, మిడ్ మానేరు నుంచి ఎల్లంపల్లికి సెకండ్ టీఎంసీ పనులను నెల రోజుల క్రితమే ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అడిషనల్ టీఎంసీకి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదు.
పాలమూరు-రంగారెడ్డికి పీఎఫ్సీ
పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.11 వేల 915 కోట్ల లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రూ.10 వేల కోట్ల లోన్ తీసుకునేందుకు గతంలోనే ఈ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంకో రూ.1,915 కోట్ల అప్పు తీసుకునేలా పాత అగ్రిమెంట్నే సవరించాలని నిర్ణయించారు. ప్రాజెక్టులోని ఎల్లూరు, ఏదుల, వట్టెం, ఉద్ధండాపూర్ పంపుహౌస్లకు సంబంధించిన ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ పనులు, సివిల్ వర్క్స్ చేయడానికి ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు రాలేదు.